బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్
ములుగు జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో నివాళి
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ
ములుగు, అక్టోబర్21 (నమస్తే తెలంగాణ) : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్పీ పోలీస్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ అత్యుత్తమంగా పనిచేస్తూ ప్రజా సేవలో ముందంజలో ఉందని తెలిపారు. ఇటీవల ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా, ములుగు జిల్లాలో సంభవించిన వరదలను ములుగు పోలీస్ శాఖ సమర్థవంతంగా ఎదుర్కొన్నదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్, ఆర్మీ శాఖలకు చెందిన 377మంది అధికారులు ఉగ్రవాదులతో పోరాడి దేశ రక్షణ కోసం ప్రాణాలను బలిదానం చేశారని వివరించారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ములుగు జిల్లా పోలీస్ శాఖ తెలియజేస్తుందని తెలిపారు. అనంతరం ఏఎస్పీ చెన్పూరి రూపేష్ అసువులుబాసిన 377మంది అమరుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం ఎస్పీ అమరుల కుటుంబాలతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలను పరిష్కరడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వారికి జ్ఞాపికలు అందజేశారు.
కొవ్వొత్తులతో నివాళి
ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట గురువారం రాత్రి ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ 5 అడుగుల ఎత్తు గల కొవ్వొత్తిని వెలిగించారు. ఈ మేరకు పోలీస్ సిబ్బందితో సైతం కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ఆలం, ఎస్బీ ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ఆర్ఐ కిరణ్, సీఐ గుంటి శ్రీధర్, ఎస్సైలు ఓంకార్యాదవ్, మొగిలి, రాజారామ్, సిబ్బంది ఉన్నారు.
త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలి : అదనపు ఎస్పీ
భూపాలపల్లి : పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీ వీ శ్రీనివాసులు పోలీసులకు సూచించారు. అమరవీరుల సేవలను స్మరిస్తూ గురువారం జిల్లా అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలోని అమరుల స్మారక స్తూపం వద్ద ఆయన నివాళులర్పించారు. ముందుగా ఆయన పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసులు జాతి సేవకు పునరింకితం కావాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. అమరుల మరణం వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, చిట్యాల, కాటారం, మహదేవ్పూర్ సీఐలు వాసుదేవరావు, వెంకట్గౌడ్, రంజిత్రావు, కిరణ్ రిజర్వు ఇన్స్పెక్టర్లు సంతోష్, సతీశ్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు గుజ్జేటి వేణు, జానీ నర్సింహులు పాల్గొన్నారు.