ఇబ్రహీంపట్నం: అర్హులందరూ కొవిడ్ టీకా తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ రవి పేర్కొన్నారు. మండలంలోని తిమ్మాపూర్, వేములకుర్తి, ఎర్దండి గ్రామాల్లో గురువారం ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన కోరుట్ల ఆర్డీవో వినోద్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్న తీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం వద్ద ఉన్న మహిళలతో కలెక్టర్ మాట్లాడారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తక్కువగా నమోదైన గ్రామాలను గుర్తించి ముందుగా ఆయా గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పదిరోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని వైద్యాధికారులు, అధికారులను ఆదేశించారు. ఎంపీపీ జాజాల భీమేశ్వరి, సర్పంచ్లు నేరేళ్ల హేమలత, సున్నం నవ్యశ్రీ, లక్షణ, వైద్యాధికారులు, ఆశ వర్కర్లున్నారు.