వెల్గటూర్: మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారిపై మంగళవారం ఉద యం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంబంపల్లికి చెందిన శేరి సుదర్శన్(33), శేరి రాజేందర్(32) అనే ఇద్దరు అన్నాతమ్ముళ్లు మృతి చెందగా.. ధర్మపురి మండల నాగారానికి చెందిన దూడ వంశీ అనే యువకుడికి గాయాలయ్యాయి.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సుదర్శన్ తండ్రి శేరి అనంతి బతుకుదెరువు నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. తన కుమార్తె సంగీత వివాహ నిమిత్తం ఐదు నెలల కితం స్వగ్రామం స్తంబంపల్లికి వచ్చాడు. నెల రోజుల కితమే ఆమె వివాహాన్ని ఘనంగా జరిపించారు. పెండ్లి పనులు పూర్తి కావడం తో అనంతి తిరిగి దుబాయ్కు సోమవారం రాత్రి 11గంటలకు తన తమ్ముడి కొడుకు శేరి రాజేందర్కు చెందిన కారులో శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరాడు.
ఆ కారులో అనంతితోపాటు అతడి కుమారుడు సుదర్శన్, రాజేందర్తోపాటు రాజేందర్ స్నేహితు డైన ధర్మపురి మండలం నాగారానికి చెందిన దూడ వంశీ ఉన్నారు. విమానా శ్రయానికి చేరుకొని అవంతికి వీడ్కోలు తెలిపి తిరిగి ముగ్గురు స్వగ్రామానికి బయలుదేరారు. మంగళవారం ఉదయం తుర్కపల్లి సమీపంలో రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శేరి సుదర్శన్, శేరి రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. దూడ వంశీ గాయాలతో బయట పడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న శామీర్పేట పోలీసులు మృతదేహాలు, గాయపడిన వంశీని శామీర్పేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
గ్రామంలో విషాదఛాయలు
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాతమ్ముళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్తంబంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు సుదర్శన్ స్థానిక సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతడికి ఐదేండ్ల కితం ప్రవళికతో వివాహం జరిగింది. అనంతికి సుదర్శన్ ఒక్కడే కుమారుడు. అనంతి తమ్ముడు జార్జి కుమారుడైన రాజేందర్కు ఏడాది కితమే వివాహం కాగా అతడి భార్య రవళి ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి.