జగిత్యాల, (నమస్తే తెంగాణ)/ కలెక్టరేట్, జూలై 8: అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పని చేసి జిల్లాను అన్నిరంగాల్లో ముందంజలో నిలపాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారుల తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూ చించారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని పద్మనాయక మినీ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించామన్నారు. ల్యాండ్ డెవలప్మెంట్ స్కీం ద్వారా ఎకరా భూమి అభివృద్ధి కోసం రూ. 4లక్షల రుణం అందజేస్తామని, దళితులు తమ భూమిని లెవల్ చేయడం, విద్యుత్ కనెక్షన్, మోటర్ పంపు, పైపులైన్ వంటి పనులు చేపట్టి వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. కూరగాయల తోటల సాగుపై రూ.3.50లక్షల వరకు రుణాలు అందిస్తామని తెలిపారు.
రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. అదేవిధంగా జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని హర్యాణ నుంచి గేదెలను తెప్పించి ఒ క్కో దళిత లబ్ధిదారుకు రెండు గేదెలను అందించామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే సి 84,339 మంది రైతుల నుంచి రూ.1042 కోట్ల విలువైన 5.52 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. ధా న్యం కొనుగోలు విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పరిధిలో నీటి సమస్య ఉత్పన్నం కాదన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువను వినియోగిస్తూ పనులు పూర్తి చేశామని, వరద కాలువకు నిర్మించిన తూముల ద్వారా 2,962 ఎకరాల ఆయకట్టుకు సైతం సాగునీరందించామని వివరించారు.
వానకాలంలో పంటకు గానూ 1,96,899 మంది రైతులకు రూ. 178.71కోట్లు రైతు బంధు చెల్లించామని, 1,65 4 మంది రైతులు మృతిచెందగా వారి కుటుంబాలకు రూ.82.7 కోట్ల రైతు బీమా అందించామన్నారు. జిల్లాలోని గ్రామాల్లో పల్లె ప్రగతి పనుల ను పకడ్బందీగా చేపట్టాలని, హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఉద్ఘాటించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. రా ష్ట్రంలో ఇప్పటి వరకు 150కోట్లకు పైగా మొక్కలు నాటామని, 3శాతం గ్రీన్ కవర్ వృద్ధి చేసుకున్నామని వివరించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించా రు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చేపట్టాలని సూచించారు.
సీఎం, మంత్రికి కృతజ్ఞతలు: దావ వసంత
గడపగడపకూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఎస్సీల అభివృద్ధి కోసం దళిత క్రాంతి మిషన్ ద్వారా పేద దళిత కుటుంబాలకు రూ.10లక్షలు అందించడానికి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కొప్పులకు జడ్పీ చైర్పర్సన్ దావ వసంత కృతజ్ఞతలు తెలియచేశారు. ఎమ్మెల్సీలకు కేటాయించిన నిధులు జిల్లా అభివృద్ధికి కేటాయించాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వైద్యులు వారి డ్యూటీ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ద వాఖానలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.
సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రవి అన్నారు. ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు బ్యాంకర్లు తప్పకుండా రుణాలు అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో 1534 మల్టీ స్పెషల్ వర్కర్స్ విధులు నిర్వహిస్తున్నారని, వారి కి ఒక్కొక్కరికి రూ. 8,500 వేతనం అందిస్తున్నామన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నామన్నారు. పల్లె ప్రగతి ప్రారంభించినప్పటి నుంచి రూ.209.20 కోట్ల నిధులు గ్రామాల్లో ఖర్చు చేశామని వెల్లడించారు. కరోనా నియంత్రణకు ఫీవర్ సర్వేను పలుమార్లు నిర్వహించామని గుర్తు చేశారు. మాస్క్ ధరంచని వారు, సామాజిక దూరం పాటించని వారి నుంచి రూ.17లక్షల జరిమానాలు విధించామని వెల్లడించారు. సభ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
సీఎం ఆశయాన్ని నెరవేర్చాలి: ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ , సీఎం కేసీఆర్ ఎంతో సదాశయంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని, అధికారులు సీఎం ఆశయాన్ని నెరవేర్చే దిశగా కృషి చేయాలని అన్నారు. భగీరథ పథకంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఇంటింటికీ తాగునీరందించాలన్నారు. సమాశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, ఇన్చార్జి సీఈవో వినోద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, ఆర్బీఎస్ జిల్లా అద్యక్షుడు వెంకట్రావు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.
వాడివేడిగా చర్చ
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చ వాడివేడిగా జరిగింది. మిషన్ భగీరథ పథకంపై అధికారులు నివేదిక సమర్పిస్తూ జిల్లాలో 371 ఓవర్ హెడ్ ట్యాంకులు, 1894.41కిలోమీటర్ల పైప్లైన్, 2,91,712 ఇండ్లకు నల్లా కనెక్షన్లు పూర్తి చేశామని, పెండింగ్ పనులు పూర్తి చేస్తామని సభకు నివేదించారు. ఏఏ గ్రామాలకు నీరందించారో చెప్పాలని పెగడపెల్లి జడ్పీటీసీ రాజేందర్రావు అధికారులను ప్రశ్నించారు. దీంతో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కల్పించుకొని ఏ సమావేశం, సభ పెట్టినా త్వరలో పనులు పూర్తి చేస్తాం.. నీళ్లిస్తాం అంటూ కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భగీరథ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో మంత్రి కొప్పుల స్పందించి మాట్లాడుతూ, చాలా గ్రామాల్లో భగీరథ నీటి సరఫరాపై సమస్యలు నెలకొన్నాయని, చేపట్టాల్సిన పనులు, నిధులపై ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు నివేదికలు కోరిందని, కానీ భగీరథ అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో సమస్యలు ఉత్ప న్నమవుతున్నాయన్నారు.
ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న పనులు, చేపట్టాల్సిన పనులు, వాటికి అయ్యే ఖర్చుల వివరాలను నివేదించాలని, దీని ప్రకారం సీఎం కేసీఆర్ను ప్రత్యేకంగా కలిసి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. భగీరథ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి నివేదిక రూపొందించాలని కలెక్టర్ను ఆదేశించారు. జిల్లా ప్రధాన దవాఖాన వైద్యులు సరైన విధంగా వైద్యసేవలు అందించడంలేదని, దవాఖానకు వచ్చే రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జగిత్యాల రూరల్ ఎంపీపీ రాజు, కథలాపూర్ జడ్పీటీసీ భూమయ్య వైద్యాధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ పనుల కోస మంటూ పలువురు ఇసుకను తరలిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని, అధికారులు అనుమతులిచ్చారంటూ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని, గోదావరి నదిలో జైన, రాజారం వద్ద నుంచి, రాయికల్ మండలం బోర్నపెల్లి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారని, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ఇసుక రీచ్లను ఏర్పాటు చేయాలని ధర్మపురి ఎంపీపీ, రాయికల్ జడ్పీటీసీలు సభదృష్టికి తీసుకువచ్చారు. సదరు ప్రాంతాల్లో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ మైనింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మెట్పెల్లి మండలంలోని ఆత్మకూర్లో ఇసుక రీచ్కు అనుమతులు ఇచ్చామని మైనింగ్ అధికారి తెలుపగా, ఇసుకను తీసేందుకు గ్రామస్తులు ఒప్పుకోవడంలేదని, ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ప్రశ్నించారు. ప్రభు త్వ పనుల కోసమే ఇసుక రీచ్ల నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతులు ఉంటాయిని మైనింగ్ ఏడీ తెలిపారు.
మొక్కలు అందజేత
జిల్లా పరిషత్ పాలక వర్గం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, హరితహారం కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు, గ్రంథాయల సంస్థ చైర్మన్, రైతు బంధు సమితి అధ్యక్షులకు మొక్కలు అందజేశారు.