జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల కొత్త బస్టాండ్లోని సులభ్ కాంప్లెక్స్లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల టౌన్ సీఐ కిశోర్ తెలిపిన ప్రకారం.. జగిత్యాల కొత్త బస్టాండ్లోని సులభ్ కాంప్లెక్స్లోని మరుగుదొడ్డిలో ఓ వ్యక్తి కాలిపోయి మృతిచెంది ఉన్నాడని గురువారం ఉదయం అందిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకుని పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహానికి పంచనామా నిర్వహించి జగిత్యాల జిల్లాప్రధాన దవాఖానకు తరలించామన్నారు.
మృతుడికి సంబంధించిన వివరాల కోసం విచారించగా.. కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో మృతుడు ఐదు లీటర్ల క్యాన్లో రెండు లీటర్ల పెట్రోల్ను నింపుకొని కొత్త బస్టాండ్ వైపు వచ్చినట్లుగా పెట్రోల్ బంకులోని సీసీ ఫుటేజీ ద్వారా తేలిందన్నారు. మృతుడు మరుగుదొడ్డిలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మృతిచెందినట్లుగా నిర్ధారణ అయ్యిందన్నారు. మరుగుదొడ్డిలో పెట్రోల్ క్యాన్, అగ్గిపెట్టె లభించాయన్నారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని లింగంపేటకు చెందిన మామిడిపెల్లి లక్ష్మీరాజం(42)గా గుర్తించినట్లు, మృతుడి మానసిక స్థితి సరిగ్గా లేదని, గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తేలిందన్నారు. మృతుడి కొడుకు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.