కరీంనగర్ కోర్టు చౌరస్తా, ఏప్రిల్ 10 : కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి మార్గమని, రాజీ కన్నా రాజ మార్గం లేదని కరీంనగర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించగా, జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్ భవన్లో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్కు ఆమె హాజరయ్యారు. రాజీపడడంతో డబ్బు, సమయం వృథా కావని, ఇరువర్గాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్రావు, లోక్ అదాలత్లో కేసుల రాజీకి అందరూ ముందుకు రావడం సంతోషకరమన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జిలు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, మాధవికృష్ణ, వాణి, మెజిస్ట్రేట్లు సాయిసుధ, ప్రదీప్, సంపతీరావు, చందన, శ్రీనిజా కొహిర్కర్, అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆవునూరి అశోక్కుమార్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరు రాజిరెడ్డి, కక్షిదారులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో 1511 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ తెలిపారు. వీటిలో రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు 1387, సివిల్ 78, మోటారు ప్రమాద పరిహారం కేసులు 42 పరిష్కరించగా వీటిలో బాధితులకు రూ. కోటి 12లక్షల 42 వేల పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. 4 కోర్టుకు రాని కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. లోక్ అదాలత్కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.