ఒకే యువతి ముగ్గురిగా పేరుమార్చుకొని మోసం
దుబాయిలో ఉంటున్న యువకుడికి గాలం
రూ.15 లక్షలకు కుచ్చు టోపీ
అరెస్ట్ చేసిన వేములవాడ రూరల్ పోలీసులు
వేములవాడ రూరల్, ఏప్రిల్ 10: అందమైన యువతినని నమ్మించి దుబాయ్లో ఉంటున్న ఓ యువకుడికి గాలం వేసింది. తరచూ ఫోన్లో మాట్లాడుతూ, వేరే యువతి టిక్టాక్ వీడియోలను వాట్సాప్లో పోస్ట్ చేసి రూ. 15 లక్షలు కొల్లగొట్టింది. పేర్లు మార్చుకుంటూ వలపు మాటలతో అతడి ఖాతాను ఖాళీ చేసింది. గల్ఫ్ నుంచి వచ్చిన యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా చీటింగ్ విషయం వెలుగుచూసింది. శనివారం సదరు యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు వెల్లడించారు. వేములవాడ రూరల్ పోలీస్స్టేషన్లో సీఐ బన్సిలాల్, ఎస్ఐ రాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన నారెడ్ల గంగారెడ్డి మూడేండ్ల కిందట దుబాయ్కు వెళ్లాడు. ఈ క్రమంలో వంటలు చేసుకొని జీవించే జగిత్యాలకు చెందిన సునీతకు ఓ ఫంక్షన్హాల్లో దొరికిన డైరీలో గంగారెడ్డి ఫోన్ నంబర్ లభించింది. ఈ నంబర్కు ఫోన్ చేసి తన పేరు నందు అని..తాను హైదరాబాద్లో ఉంటానని నమ్మబలికింది. టిక్టాక్ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న అందమైన యువతి వీడియో తనదనీ చెప్పి గంగారెడ్డికి వాట్సాప్ ద్వారా పంపింది. తరచూ అతడితో ఫోన్లో చనువుగా మాట్లాడేది. వలపు మాటలతో రెచ్చగొట్టేది. మూడు నెలల తర్వాత సునీత గొంతు మార్చి తన పేరు వైశు అని నందు స్నేహితురాలిగా పరిచయం చేసుకున్నది.
హైదరాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తుండగా నందుకు ప్రమాదం జరిగిందని చెప్పింది. తన ఫోన్లో మీ ఇద్దరి ఫొటోలు, వాయిస్ రికార్డులు ఉన్నాయనీ, తనకు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే నందు వాళ్ల ఇంట్లో చెబుతాననీ బెదిరించింది. దీంతో భయపడ్డ గంగారెడ్డి వైశు చెప్పిన ఇటిక్యాల రవి అకౌంట్ నంబర్కు పలుమార్లు డబ్బులు పంపాడు. అనంతరం మరల గొంతుమార్చుతూ సునీతగా పరిచయం చేసుకొని పలుమార్లు గంగారెడ్డిని బెదిరించి దాదాపు రూ 15 లక్షల వరకు కొల్లగొట్టింది. ఇంకా డబ్బులు పంపకుంటే మీ కుటుంబసభ్యులను చంపుతానని భయపెట్టింది. ఆమె చెప్పిన విధంగా రెండు నెలల క్రితం మరో రూ 1.20లక్షలను ఆమె చెప్పిన అకౌంట్ నంబర్కు పంపాడు. కాగా, ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన గంగారెడ్డి వేములవాడ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. తన ఖాతాకు సంబంధించిన పత్రాలు అందించాడు. సీఐ బన్సిలాల్, ఎస్ఐ రాయుడులు విచారణ చేపట్టగా గంగారెడ్డిని మోసం చేసింది ఒకే యువతి అని, పేరుమార్చి డబ్బులు వసూలు చేసిందని తెలింది. దీంతో శనివారం వేములవాడ కోర్టు సమీపంలో సునీతను అదుపులోకి తీసుకోని విచారించారు. ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్, గోల్డ్ చైన్, రూ. 35 వేలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
బహుజన తత్వవేత్త ఫూలే : సీఎం కేసీఆర్
గూగుల్లో వేధింపులు.. సుందర్ పిచాయ్కు 500 మంది ఉద్యోగుల బహిరంగ లేఖ