బుగ్గారం,ఏప్రిల్ 7: మహిళల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. వారి సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మండ లంలోని వెల్గొండలో బుధవారం మంత్రి పర్యటించారు. రూ. 54 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అతివల అభ్యున్నతికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు, డబుల్ బెడ్రూం లాంటి పథకాలను మహిళల పేరిట అమలు చేస్తూ వారి గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నామని పేర్కొన్నారు.
సమాఖ్య సంఘాలకు చిరు వ్యాపారాల నిర్వహణకు రుణా లు ఇస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలు సహజ బ్రాండ్ పేరిట సబ్బులు, కొబ్బరినూనె వంటి సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తున్నారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని మహిళలకు సూచించారు. వ్యాపారాల నిర్వహణకు మహి ళా సంఘాలకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం 22 మంది లబ్ధిదారులకు రూ.6,43,000 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం డీఎంఎఫ్టీ నిధులు రూ.9.8 లక్షలతో రెండు డ్రైనేజీలు, రూ.38 లక్షల నిధులతో సీసీ రోడ్లకు కొప్పుల శంకుస్థాపన చేశారు.
ఆయా కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ బాదినేని రాజమణి, జడ్పీటీసీ బాదినేని రాజేందర్, వైస్ ఎంపీపీ సుచేందర్, ఎంపీటీసీ రేండ్ల లక్ష్మి, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ తాండ్ర సత్యనారాయణ రావు, కో ఆప్షన్ సభ్యుడు రెహమాన్, టీఆర్ఎస్ నేతలు రేండ్ల రవి, సత్యం, మంత్రి రమేశ్ పాల్గొన్నారు.