మెట్పల్లి, మే 21: తెలంగాణను సాధించడమే గాకుండా దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన చరిత్ర మనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలనను అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలో ఆమె పర్యటించారు. ముందుగా బండలింగాపూర్ గండి హన్మాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మెట్పల్లిలోని వెంకట్రెడ్డి గార్డెన్స్లో నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం జగిత్యాలలో మామిడి మార్కెట్ను సందర్శించారు. తదనంతరం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి, హన్మాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. అంతకుముందు మెట్పల్లిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సర్కారు రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నదన్నారు.
అవినీతి పాలన అంటూ బీజేపీ, కాంగ్రెసోళ్లు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని, మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అవినీతి రహిత పాలనపై ప్రజలకు వివరించాలన్నారు. బీడీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే 15 రాష్ర్టాల్లో ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం తప్ప ఏ రాష్ట్రంలో కూడా వారికి పింఛన్ ఇవ్వడం లేదన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పింఛన్ 700 ఇస్తుంటే మన రాష్ట్రంలో 2,016 ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 వేల మందికి దళిత బంధు ఇచ్చామని, రాబోయే రోజుల్లో 3 లక్షల మందికి ఇస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 7 వేల మంది బీసీ విద్యార్థులు మాత్రమే వసతి గృహాల్లో చదువుకునే అవకాశముండేదని, రాష్ట్రం ఏర్పడ్డాక 281 బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేసి 1.32 లక్షల మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 96 లక్షల మంది విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం 8 వేలు కోట్లు వెచ్చిస్తున్నదని చెప్పారు.
మూడేళ్లలో అర్వింద్ చేసిందేమీ లేదు
ప్రజాస్యామ్యంలో ఎవరు గెలిచినా మర్యాద ఇవ్వాలని, అందుకే ఎంపీగా అర్వింద్ గెలిచాక ఏమైనా అభివృద్ధి చేస్తాడేమో అని వేచి చూశామని పేర్కొన్నారు. కానీ ఆయన చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. మూడేళ్లలో కేవలం 1.92 కోట్లు తెచ్చాడంటా.. అవి జుట్టుకు 200 కూడా రావని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు తేక పోగా స్పైస్ బోర్డు తెచ్చానంటూ అంటూ ప్రచారం చేసుకుంటుండని, అది తాను ఎంపీగా ఉన్నప్పుడు స్పైస్ కేంద్రా న్ని ఏర్పాటు చేయించానని చెప్పారు. పని చేసే సత్తా లేక, అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నాడని, అబద్ధానికి ప్రతి రూపం ఎంపీ అర్వింద్ అని దునుమాడారు. ఇప్పుడు అమెరికాలో యాత్రచేస్తున్న ఆయన అక్కడ కూడా అసత్య ప్రచారం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.
జీవన్రెడ్డి బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్
‘కాంగ్రెసోళ్లు రచ్చబండ చేస్తున్నరట, గ్రామాలకు వచ్చే కాంగ్రెసోళ్లకు మనం కట్టిన వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, మిషన్ భగీరథ ట్యాంకులు, నల్లాలు, విద్యుత్, సీసీ రోడ్లు, సబ్సిడీ వాహనాలు చూపించాలి’ అంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆపార్టీని విమర్శించక పోగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్పై అబద్ధపు ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు ఇప్పించమని మీ రాహుల్ గాంధీతో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడింగించండి అని ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
సైనికుల్లా పనిచేయండి..
‘అవినీతి లేని అద్భుతమైన పాలన అందిస్తున్న మన టీఆర్ఎస్ గులాబీ కండువా మెడలో ఉంటే గౌరవం. టీఆర్ఎస్ అడ్డా కోరుట్ల గడ్డా. ఇక్కడ 2009 నుంచి గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో ఘన విజయం కోసం సైనికుల్లా పనిచేయాలి’ అని శ్రేణులకు పిలుపునిచ్చారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు 3లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావు, మెట్పల్లి, కోరుట్ల మున్సిపల్ అధ్యక్షులు రాణవేని సు జాత, అన్నం లావణ్య, ఎంపీపీలు మారు సాయిరెడ్డి, భీమేశ్వరీ, సరోజ, తోట నారాయణ, జడ్పీటీసీలు భారతి, దారిశెట్టి లావ ణ్య, శ్రీనివాస్రెడ్డి, కోరుట్ల, మెట్పల్లి, మ ల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు దారిశెట్టి రాజేశ్, నల్ల తి రుపతిరెడ్డి, తోట శ్రీనివాస్, ఎల్లాల దశరథరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర్రావు, అన్నం అనిల్, జడ్పీటీసీ బాదినేని రాజేందర్, నియోజకవర్గంలోని టీఆర్ఎస్కు చెందిన పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యువత సన్నద్ధం కావాలి
తెలంగాణను తెచ్చుకున్నది యువత కోసం, భావి తరాల కోసం. స్థానికత, స్థానికేతర అంశాలకు సంబంధించి ప్రధాని మోడీ వద్ద రెండేళ్లుగా ఫైల్ పెండింగ్ ఉన్నా పట్టించుకోలేదు. కానీ, సీఎం కేసీఆర్ ఒత్తిడి తెచ్చి జీవో 317 తెచ్చారు. దీని వల్ల ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే వస్తాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. యువత సన్నద్ధమై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ఎమ్మెల్సీ కవిత
కొండగట్టు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఆ దిశగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పనులు చేపట్టేందుకు సిద్ధం గా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో, బేతాళస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణంలో ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్కుమార్, విద్యాసాగర్రావు, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్సీ మాట్లాడారు. గతేడాది 81రోజులపాటు కొండగట్టులో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారని, అప్పుడు కరోనా వల్ల చాలామంది ఇండ్లల్లో టీవీల ముందు కూర్చుని పారాయణం చేశారని గుర్తు చేశారు. ఈ యేడాది ఆలయంలో 41 రోజుల హనుమాన్చాలీసా పారాయణం నిర్వహిస్తామని, శనివారం ప్రత్యేకంగా 108 సార్లు వేలాది మందితో చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు.
అంజన్న ఆలయ క్షేత్ర మహాత్యం చాలా గొప్పదని, ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవను చూపిస్తున్నదని, ఇప్పటికే ఆలయ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సీఎంవో కార్యాలయ అధికారుల ద్వారా వివరాలనుసేకరించారని చెప్పారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెల మారుతీస్వామి, స్థానాచార్యులు కపీందర్ వారిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ మిట్టపల్లి విమల, జడ్పీటీసీ రామ్మోహన్రావు, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్, పునుగోటి కృష్ణారావు, ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, సహకార సంఘాల అధ్యక్షులు రాంలింగారెడ్డి, మధుసూదన్ రావు, సాగర్ రావు, రాజనర్సింగరావు, నాయకులు దావ సురేశ్, నీలగిరి రాజేందర్ రావు, పాసుల చరణ్, జనగం శ్రీనివాస్, ప్రవీణ్, కోటేశ్వర్రావు, పంజాల మల్లేశం, పాలకమండలి సభ్యులు ప్రవీణ్, జున్ను సురేందర్, వొల్లాల లింగంగౌడ్, ముద్దం రవి, సతీశ్, ఆలయ సిబ్బంది బుద్ది శ్రీనివాస్, శ్రీనివాస్ శర్మ, రాజేశ్వర్రావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.