వైభవంగా మొదలైన ధర్మపురి బ్రహ్మోత్సవాలు
కనులపండువలా పుట్ట బంగారం తెచ్చే ప్రక్రియ
నేడు శేషప్ప కళావేదికపై స్వామి వార్ల కల్యాణోత్సవం
పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులు
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సింధూశర్మ
ధర్మపురి మార్చి 24 : ధర్మపురి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కనులపండువలా సాగాయి. బుధవారం ఉదయం మంగళవాయిద్యాలతో ఈవో సంకటాల శ్రీనివాస్, సిబ్బంది కలిసి యజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల ఇంటికి వెళ్లి ఉత్సవాలు నిర్వహించేందుకు సంప్రదాయ రీతిలో ఆహ్వానించారు. ఆలయ పక్షాన అర్చకులకు ఈవో దీక్షావస్ర్తాలు సమర్పించారు. వేద పండితులు బొజ్జ రమేశ్శర్మ, పురోహితులు బొజ్జ సంతోష్కుమార్శర్మ మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, నంబి శ్రీనివాస్, నరసింహమూర్తి, రమణాచార్యులు కలశ స్థాపన, విష్వక్సేన వాసుదేవ పుణ్యాహవాచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5గంటల తర్వాత డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి దంపతులు స్వామివారి కల్యాణం కోసం తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించారు. సాయంత్రం 7గంటలకు లక్ష్మీనర్సింహస్వామి (యోగా, ఉగ్ర) శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల ఉత్సవ మూర్తులను సేవలపై ఉంచి వరాహతీర్థం, పుట్టబంగారం కోసం తీసుకెళ్లారు. చింతామణి చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు ఊరేగింపుగా వెళ్లి, పూజలు చేసి పుట్టబంగారం తీసుకువచ్చారు. నేటి సాయంత్రం 6గంటలకు గోధూళి సుముహుర్తాన లక్ష్మీనర్సింహస్వామి వార్ల(ఉగ్ర, యోగా) కల్యాణోత్సవం శేషప్ప కళావేదికపై నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎస్పీ సింధూ శర్మ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సీఐ రామ్చందర్రావును ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.