కరీంనగర్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఆయన ఆర్డీవోలు, తహసీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లు, కొవిడ్ వ్యాక్సినేషన్, భూసమస్యలు, తదితర అంశాలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు టోకెన్లు ఇచ్చి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చేలా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో వ్యవసాయాధికారులతో సమన్వయం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు, గన్నీ సంచుల కొరత, రవాణా సమస్యలు తలెత్తకుండా చూడాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ సిబ్బంది అందరికీ శుక్రవారంలోగా కరోనా టీకా వేయించాలన్నారు. భూసమస్యల సవరణకు సంబంధించిన వివరాలను కొత్త చెక్ లిస్టు ప్రకారం వెంటనే పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. పాసు పుస్తకాల్లో తప్పులను సరిచేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని, దీని ప్రకారం మండలాల్లో పెండింగ్లో ఉన్న భూసమస్యల వివరాలు తయారు చేసి పంపేందుకు అదనంగా సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో ఆర్డీవోలు ఆనంద్కుమార్, బెన్ షాలోం, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేశ్, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు..
ఏర్పాట్లు చేయాలి
విద్యానగర్, ఏప్రిల్ 15: కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్, మెప్మా పీడీ, అర్బన్ వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో 6 యూపీహెచ్సీలలో కొవిడ్ టీకా వేస్తున్నారని, మరో 4 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బందికి సహాయంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. సప్తగిరికాలనీ కేజీబీవీలో రేపటి నుంచి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, డీఎంహెచ్వో డాక్టర్ జీ సుజాత, మెప్మా పీడీ రవీందర్, డీటీసీవో డాక్టర్ కేవీ రవీందర్రెడ్డి, నోడల్ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్.. సెకండియర్ పరీక్షలు వాయిదా
IPL 2021: రాజస్థాన్ బౌలర్లు అదుర్స్..ఢిల్లీ స్కోర్ 147