టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్
కొత్తపల్లి, జూన్ 5 : కార్మికులను, కార్మిక సంఘాలను ఓర్వలేని చరిత్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ది అని, ఆయన తన మంత్రి పదవిని స్వలాభం కోసమే ఉపయోగించుకున్నాడే తప్ప కార్మికలోకానికి చేసింది శూన్యమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్ విమర్శించారు. కరీంనగర్ కోర్టు సమీపంలోని సంఘ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కార్మిక సంఘాలపై అసత్యపు ఆరోపణలు చేశారని, అసలు కార్మిక సంఘాలపై ఆయన కామెంట్ చేయడం ఏంటని, అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని హితవుపలికారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 2014లో సీఎం కేసీఆర్ను కలుస్తామని పలుమార్లు ఈటల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పూర్తి నిర్లక్ష్యం వహించారని, అనంతరం కొప్పుల ఈశ్వర్ను కలిసి తమ గోడు వెల్లబోసుకోగా రెండు దఫాలుగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు.
అలాంటి వ్యక్తి అయిన ఈటల రాజేందర్ కార్మిక సంఘాలపై స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న టీఆర్వీకేఎస్తోపాటు ఇతర సంఘాలను ఆయన ఎప్పుడూ ఓర్వలేదని, ఇది చాలా సందర్భాల్లో జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సంఘాల మనుగడ పోయిందని ఈటల చెప్పడం సరికాదన్నారు. ఎలక్ట్రీసిటీ, సింగరేణి, ఆర్టీసీతో పాటు పలు పరిశ్రమల్లోని కార్మిక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్నాయన్నారు. 2004లోనే అప్పుడు ఉద్యమనేత కేసీఆర్ అనుమతితోనే యూనియన్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ సంస్థలో పెద్ద సంఘాలుగా చెప్పుకొనే యూనియన్లు గతంలో 27.5 శాతం పీఆర్సీకి అగ్రిమెంట్ చేసుకుంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో పీఆర్సీ 30 శాతం సాధించినట్లు చెప్పారు. ఇది కార్మిక సంఘాల విజయమేనన్నారు.
విద్యుత్ సంస్థలో వేతనాల పెంపు సాధారణంగా యాజమాన్యంతో చర్చించడం జరుగుతుందని, రాష్ర్టాభివృద్ధిలో విద్యుత్ సంస్థ ప్రాధాన్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ 2018లో నేరుగా మేనేజ్మెంట్, కార్మిక సంఘాలతో చర్చించారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 35 శాతం పే స్కేలు అమలు చేయించారని, ఇందులో ఎమ్మెల్సీ కవిత సహకారం మరువలేనిదన్నారు. సీఎం కేసీఆర్కు విద్యుత్ ఉద్యోగులపై ఎనలేని ప్రేమ ఉందని, త్వరలో ఉద్యోగులతో పాటు కార్మికులకు వ్యాక్సిన్ వేయిస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. టీఆర్వీకేఎస్ ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటుందని, హుజూరాబాద్లో ఉప ఎన్నిక వచ్చినా వారి వెంటే ఉండి విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్వీకేఎస్ కంపెనీ అధ్యక్షుడు జీ రాందాస్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ రాజలింగం, జిల్లా కార్యదర్శి ఎస్ మునీందర్, ట్రాన్స్కో కార్యదర్శి ప్రసాద్, కంపెనీ కోశాధికారి తిరుపతి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, డివిజన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాములు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మహబూబ్, తదితరులు పాల్గొన్నారు.