జగిత్యాల రూరల్ : హరితహారంలో భాగంగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సమస్యలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటానని జగిత్యాల కలెక్టర్ రవి హెచ్చరించారు. మంగళవారం ఆయన జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేటలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని , అదేవిధంగా బృహత్ పల్లె ప్రకృతివనం కోసం గ్రామంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బృహత్ పల్లెప్రకృతివనానికి స్థలం సరిపడాలేకపోతే అటవీ, అసైన్డ్, వాడుకలోలేని స్థలాలను గుర్తించి అక్కడ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రకృతి వనంలో ఎక్కువగా అటవీ మొక్కలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జగిత్యాల ఆర్డీవో ఆర్డి మాధురి, డీఆర్డీవో పీడీ ఎస్ వినోద్, ప్రత్యేక అధికారి రాజేశం, ఎంపీడీవో స్వరూపారాణి, సర్పంచ్ గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.