జగిత్యాల కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న కొవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాను వేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో సాగుతున్న కొవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మంత్రి కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేలు, కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర అధికారులతో జూమ్ యాప్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ రాష్ట్రం నుంచి కొవిడ్ మహమ్మారిని పాలదోలేందుకు సీఎం కేసీఆర్ రోజుకు మూడు లక్షల కొవిడ్ టీకాలు అందించేందుకు స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాను పంపిణీ చేయాలన్నారు.
ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపు అని తెలిసేలా సీఎం కేసీఆర్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని కలెక్టర్కు సూచించారు. కోరుట్లలో వైద్యాధికారి సరిగ్గా స్పందించడంలేదని మున్సిపల్చైర్పర్సన్ చేసిన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్లో రాష్ట్రంలోనే అత్యధిక వ్యాక్సిన్లు అందించిన జిల్లాగా జగిత్యాలను నిలిపిన అధికారులను మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలతో ప్రజల్లో మంచి స్పందన వస్తున్నదని, కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులు అని తెలిసేలా సీఎం కేసీఆర్ ఫొటో ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గంలోని
అన్ని ప్రాంతాల్లో కొవిడ్ స్పెషల్ డ్రైవ్ క్యాంపులకు ఏర్పాట్లు చేశామని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంపులు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ జిల్లాలో 274 ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా అందిస్తున్న కొవిడ్ టీకా పంపిణీపై జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, జిల్లాలో వంద శాతం వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం కలెక్టర్ రవి మాట్లాడూజిల్లా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు గాను 274 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 6,53,480 మంది 18 ఏండ్లు నిండిన వారు ఉన్నారని, వీరిలో 42.8శాతం మందికి మొదటి డోసు, 17 శాతం మందికి రెండో డోసు వ్యాక్సిన్ వేశామన్నారు. సెప్టెంబర్ 16న ప్రారంభమైన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తొలి రోజు 19,934 మందికి, 17న 19,546 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి స్పందన అధికంగా ఉండటంతో 140 సబ్ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసిన ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రం నుంచి 150 డోసులు అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ, అంగన్వాడీ, ఆశలు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా వారితో ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ చేయించుకోని వారిని గుర్తిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, రాయికల్ మున్సిపల్ చైర్పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.