జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ 24 : గంజాయి ముఠా గుట్టును జగిత్యాల టౌన్ పోలీసులు రట్టు చేశారు. గంజాయి సేవించే స్థితి నుంచి ఏకంగా రవాణా చేసే స్థాయికి చేరుకున్న ఇద్దరు వ్యక్తులతో పాటు గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు గంజాయి మొక్కలను, మూడు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల డీఎస్పీ రత్నపురం ప్రకాశ్ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. జగిత్యాల టౌన్ సీఐ కె. కిశోర్ సెప్టెంబర్ 28న తన సిబ్బందితో కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద గల ముంబాయి షాపింగ్ మాల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద నుండి 250గ్రా. గంజాయి లభించింన్నారు.
పట్టుబడ్డ వ్యక్తిని విచారించగా జిల్లా కేంద్రానికి చెందిన మేకల రాజు అలియాస్ కిన్నెరగా తేలిందన్నారు. మేకల రాజును మరింత లోతుగా విచారించగా.. జగిత్యాల వాణీనగర్కు చెందిన అరుముల్ల సాయి అలియాస్ చేపల సాయికుమార్ అను స్నేహితుడు కూడా ఉన్నట్లు తేలిందన్నారు.
స్నేహితులైన మేకల రాజు, సాయికుమర్లు మొదటి గంజాయి సేవించడానికి అలవాటు పడ్డారని, ఆ తర్వాత ఆసీఫాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల నుండి గంజాయిని తీసుకువచ్చి జిల్లాలో వారి స్నేహితులకు విక్రయించేవారన్నారు. గంజాయి సేవనానికి, విక్రయాలకు అలవాటు పడ్డ వీరు గంజాయి దొరకని సందర్భాల్లో దొంగతనాలకు సైతం పాల్పడ్డారన్నారు. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు, మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ను దొంగిలించారన్నారు.
28న పట్టుడ్డ రాజును అదేరోజు రిమాండ్కు పంపించామని, రాజు స్నేహితుడైన సాయికుమార్ కోసం వెతుకగాపరారీ అయ్యాడన్నారు. పరారీలో ఉన్న సాయికుమార్ ఆసీఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలంలోని మోతిగూడ గ్రామంలో ఉన్నాడనే సమాచారం మేరకు జగిత్యాల టౌన్ సీఐ కిషోర్ తన సిబ్బందితో వెల్లి సాయికుమార్ను పట్టుకున్నారన్నారు.
గంజాయి ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారు.. మీకు ఎవరు అందచేస్తున్నారని సాయికుమార్ను సీఐ విచారించగా ఆసీఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మోతిగూడ గ్రామానికి చెందిన మాడావి చందు సాగు చేసి తమకు అందచేస్తాడని, రాజుతో కలిసి జగిత్యాల, జగిత్యాల చుట్టుపక్కల యువకులకు చిన్నచిన్న ప్యాకెట్లలో నింపి గంజాయిని విక్రయిస్తామని తెలిపాడన్నారు.
సీఐ కిషోర్ తన సిబ్బంది, లింగాపూర్ డిప్యూటీ తహసీల్దార్తో కలిసి చందు సాగు చేస్తున్న గంజాయి తోటకు వెళ్లి గంజాయి మొక్కలను ద్వంసం చేశారు. గంజాయి సాగు చేస్తున్న చందు, సరఫరా చేస్తున్న సాయికుమార్లను అదుపులోకి తీసుకువచ్చి ఆదివారం రిమాండ్కు పంపించామన్నారు. చాకచక్యంగా వ్యవహరించి గంజాయి ముఠా గుట్టును రట్టు చేసిన సీఐ కిషోర్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.