ధర్మపురి : రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఆయన ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 70 మంది లబ్ధిదారులకు రూ.70,08,120ల విలువ గలిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుశిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 68 మంది మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పాలిట వరంలా మారాయన్నారు. 2014 కంటే ముందు ఆడబిడ్డల వివాహాలు చేయాలంటే తల్లిదండ్రులు అప్పులు చేసి వాటిని తీర్చే పరిస్థితి లేక నానా ఇబ్బందులు పడేవారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డలకు కట్నంగా రూ.లక్ష116 లను అందజేస్తున్నదని ఆయన తెలిపారు.
అదేవిధంగా మండలంలోని నేరెళ్ల గ్రామంలో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నేరెళ్లలో రూ.20 లక్షలతో చేపట్టిన రెండు వైకుంఠధామాలతోపాటు రెండు సీసీ రోడ్లు, పల్లెప్రకృతివనాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, నేరెళ్ల సర్పంచ్ పలిగిరి వసుంధర-సత్యం, ఎంపీటీసీ రెడ్డవేని సత్యం, ఏఎంసీ వైస్ చైర్మన్ శేర్ల రాజేశం, నాయకులు అక్కనపల్లి బాబుకుమార్ తదితరులున్నారు.