జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 17: బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లిన ఓ కార్మికుడు అనారోగ్యం పాలై దవాఖానలో చేరి కోమాలోకి వెళ్లాడు. తొమ్మిది నెలలుగా అక్కడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్ బిల్లు 16,71,886.81ధరమ్స్(3.40కోట్లు)కు చేరింది. బిల్లు చెల్లించేవారులేక, స్వగ్రామం చేరే దిక్కులేని బాధితుడికి గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అండగా నిలిచింది. ఇండియన్ కాన్సులేట్తో మాట్లాడి బిల్లు మాఫీ చేయించి బాధితుడిని హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు చేర్చారు. వివరాలను గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండేటి నర్సింహ, ఉపాధ్యక్షుడు ఆరె శేఖర్ నమస్తే తెలంగాణకు వివరించారు. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామం సుద్దపెల్లికి చెందిన కట్ల గంగారెడ్డి జీవనోపాధి కోసం దుబాయి వెళ్లాడు. అనారోగ్యంతో గత డిసెంబర్లో దుబాయిలోని ఓ దవాఖానలో చేరాడు. పెరాలసిస్తో గంగారెడ్డి కోమాలోకి వెళ్లాడు. అప్పటినుంచి అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గంగారెడ్డిని స్వగ్రామానికి చేర్చాలని బాధితుడి కొడుకు మణికంఠ, అతడి స్నేహితుడు ఇబ్రహీం గల్ఫ్ కార్మికుల రక్షణ సమితిని ఆశ్రయించారు. దీంతో సమితి సభ్యులు దుబాయిలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ సాయంతో హాస్పిటల్ వర్గాలతో మాట్లాడి దవాఖాన బిల్లు 16,71లక్షల ధరమ్స్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి నిమ్స్ దవాఖాన వరకు ఎయిర్ అంబులెన్స్కు, ప్రయాణానికి అవరసమై న 4.40లక్షలను సైతం ఇండియన్ కాన్సులేట్ సమకూర్చిందని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అద్యక్ష ఉపాధ్యక్షులు గుండెల్లి నర్సింహ, ఆరె శేఖర్ తెలిపారు. బిల్లు మాఫీ చేయించిన ఇండియన్ కాన్సులేట్, దవాఖానకు, దుబాయి పోలీసులకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.