బీజేపీలోకి వస్తున్నారన్న సమాచారంతో పార్టీని వీడుతున్న నేతలు
మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్
హుజూరాబాద్లో మరో కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ చేరిక
ఈటలలో అపరిచితుడు ఉన్నాడు:శంతన్రెడ్డి
కార్పొరేషన్/ హుజూరాబాద్, మే 28 : మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్తున్నారన్న సమాచారంతో ఆ పార్టీ నేతల నుంచి ఆదిలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి, టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు. హుజూరాబాద్ మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ దండ శోభ, టీఆర్ఎస్ నాయకుడు విక్రమ్రెడ్డి శుక్రవారం కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హుజూరాబాద్లో 18వ వార్డు కౌన్సిలర్ ప్రతాప మంజుల, ఆమె భర్త కృష్ణ, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి రజిత, ఆమె భర్త శంతన్ రెడ్డి(సీనియర్ నాయకుడు) టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కరీంనగర్లో దండ శోభ మాట్లాడుతూ, మాజీ మంత్రి ఈటల రాజేందర్తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. గత ఎన్నికల్లో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిచి బీజేపీలో చేరామన్నారు. ఈటల భూ ఆరోపణలు ఎదుర్కొని టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరుతున్నారని, అందుకే తాము టీఆర్ఎస్లో చేరినట్లు స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో సింగిల్ విండో డైరెక్టర్లు భాస్కర్రెడ్డి, ప్రతాప ఆంజనేయులు, మధుసూదన్ తదితరులు ఉన్నారు. అలాగే, మేయర్ వై సునీల్రావును 18వ వార్డు కౌన్సిలర్ ప్రతాప మంజుల, ఆమె భర్త కృష్ణ, మాజీ కౌన్సిలర్ శంతన్రెడ్డి కలిశారు. ఆయన వారికి గులాబీ కండువా కప్పారు.
ఈటలలో అపరిచితుడు ఉన్నాడు : శంతన్రెడ్డి
హుజూరాబాద్లో బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోరెడ్డి శంతన్రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అందరూ అనుకున్నట్లుగా సౌమ్యుడు కాదని, ఆయనలో అపరిచితుడు దాగి ఉన్నాడని ఎద్దేవా చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఈటల బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. అక్రమాస్తులను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందేనని, అలాగే దళితుల భూములు ఆక్రమించుకున్న రాజేందర్ను బీజేపీలో చేర్చుకోవడం ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారో? ఆ పార్టీ నాయకులు తెలుపాలని డిమాండ్ చేశారు. ఈటల బీజేపీలో చేరుతున్నాడని తెలిసి చాలా బాధేసిందని, అందుకే ఆ పార్టీకి గుడ్బై చెప్పామన్నారు. 2018 ఎన్నికలకు ముందు రాజేందర్తో కలిసి పని చేశామని, ఆయన రాజకీయాలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయని గుర్తు చేశారు. 2004 ఎన్నికల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు 2009లో కనిపించలేదని, మళ్లీ 2018 ఎన్నికలు వచ్చేసరికి కొత్త ముఖాలు కనిపించాయన్నారు. ప్రతి ఎన్నికల్లో పాత వారిని అవమానపరిచి పక్కన పెట్టి, ఇతర పార్టీల వారిని కలిసి అభివృద్ధి చేసుకుందామని మాయ మాటలు చెప్పడం ఆయన కుసంస్కృతికి నిదర్శనమన్నారు. ప్రతి గ్రామంలో ఈటల తన స్వలాభపేక్ష కోసం మూడు గ్రూపులు చేసేవాడని, అతని కోసం ఆ గ్రూపులు తన్నుకుచచ్చే విధంగా చేసేవాడని మండిపడ్డారు.
అభివృద్ధిని చూసే చేరికలు
సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం, చేస్తున్న అభివృద్ధిని చూసి కౌన్సిలర్ ప్రతాప మంజుల ఆమె భర్త కృష్ణ, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి రజిత ఆమె భర్త శంతన్రెడ్డి టీఆర్ఎస్లో చేరారని పారీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా పని చేస్తామని వెల్లడించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నాడని తెలియడంతో, ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేక టీఆర్ఎస్లో చేరామని వారు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో మేయర్ వై సునీల్రావు, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు కల్లెపల్లి రమాదేవి, టీఆర్ఎస్ నాయకులు పరిపాటి రవీందర్రెడ్డి, దొంత రమేశ్, చల్ల హరిశంకర్, బోనాల శ్రీకాంత్, బండారు వేణు, శ్రీనివాస్, సాయిచరణ్, రియాజ్, మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.