స్కూళ్లు, సంస్థల భవనాలను సిద్ధంగా ఉంచండి
బాధితులకు మెరుగైన వైద్యం అందించండి
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచన
పరిస్థితులపై హైదరాబాద్ నుంచి ఫోన్ ద్వారా ఆరా
అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
రాజన్న సిరిసిల్ల ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ విద్యానగర్: కొవిడ్ బాధితుల కోసం గ్రామాలు.. పట్టణాల్లో ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, స్కూళ్లు, ప్రభుత్వ సంస్థల భవనాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి, బాధితులకు అందుతున్న వైద్య సేవలపై బుధవారం హైదరాబాద్ నుంచి ఫోన్ ద్వారా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్లు కృష్ణభాస్కర్, శశాంక, కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో వేర్వేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కరోనా సోకితే ఇంట్లో ఐసొలేషన్ కోసం వసతి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామాల్లో ప్రభుత్వ సూళ్లు, కరీంనగర్ నగర వాసులకు శాతవాహన యూనివర్సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిరిసిల్ల వాసుల కోసం పోలీస్ ట్రైనింగ్ సెంటర్, వేములవాడ వాసులకు ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కొవిడ్ బాధితులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.