అధికారులు ఎఫ్ఏక్యూ జారీ చేసినా కొర్రీలు
పలువురు మిల్లర్ల తీరుపై పీఏసీఎస్ చైర్మన్ల మండిపాటు
చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఫిర్యాదు
లేకపోతే రైతులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరిక
శంకరపట్నం, ఏప్రిల్ 28: కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా పలు రైస్ మిల్లుల యజమానులు సతాయిస్తున్నారని మండలంలోని పీఏసీఎస్ల చైర్మన్లు తహసీల్దార్ శ్రీనివాస్రావుకు ఫిర్యాదు చేశారు. బుధవారం మెట్పల్లి, తాడికల్, గద్దపాక సహకార సంఘాల చైర్మన్లు పొద్దుటూరి సంజీవరెడ్డి, కేతిరి మధూకర్రెడ్డి, గుర్రాల తిరుపతిరెడ్డి హుజూరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంతం కృష్ణారెడ్డితో కలిసి తహసీల్ కార్యాలయానికి వచ్చారు. తమ విండోల ద్వారా పలు గ్రామాల్లో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో మిల్లర్లు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తాలు పట్టి, అధికారులు ఎఫ్ఏక్యూ జారీ చేసినా కొర్రీలు పెడుతూ ధాన్యం దిగుమతికి నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, ధాన్యంలో 17 శాతం తేమ, కిలో మట్టి, కిలో తాలు, చెత్తా చెదారం, 3 శాతం పచ్చ గింజలు, 6 శాతం మొలకెత్తిన, నల్ల గింజలు, 6 శాతం ఇతర బెరుకులు ఉండవచ్చని ప్రభుత్వం నిబంధనలు రూపొందించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం రైతులు తెచ్చే ధాన్యంలో మట్టి, మొలకెత్తిన ధాన్యం, బెరుకులు ఉండడం లేదని పేర్కొన్నారు. తాలు పట్టినా సరిగా పట్టడం లేదంటూ కుంటి సాకులు చెప్పి దిగుమతి చేసుకోకపోవడం సరికాదన్నారు. తాము ప్రతి సమస్యనూ అధికారుల దృష్టికి తేవాలంటే ఎలా అన్నారు. మిల్లర్లకు ప్రభుత్వ నిబంధనలు పట్టవా..? అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం దిగుమతికి కొర్రీలు పెడుతూ గంటలు, రోజుల తరబడి జాప్యం చేస్తుండడంతో ఎవరూ ట్రాక్టర్లు పెట్టేందుకు ముందుకు రావడం లేదని తెలిపారు. ధాన్యం దిగుమతికి సతాయించే మిల్లర్లపై తగు చర్యలు చేపట్టి, ఇకమీదనైనా రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేదా రైతులతో కలిసి తాము ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
సతాయిస్తే చర్యలు తప్పవు: తహసీల్దార్
ఈ సందర్భంగా రాజరాజేశ్వర రైస్ మిల్లు, శ్రీలక్మీ రైస్మిల్లు నిర్వాహకులతో తహసీల్దార్ ఫోన్లో మాట్లాడారు. నిబంధనల మేరకు ధాన్యం దిగుమతి చేసుకోక సతాయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకవేళ ధాన్యంలో నాణ్యతా లోపాలుంటే తమ దృష్టికి తెస్తే వెంటనే క్వాలిటీ కంట్రోల్ అధికారులను రప్పించి పరిశీలన జరిపిస్తామని తెలిపారు. అలాగే మిల్లు వద్దకు ధాన్యం వాహనం వచ్చిన సమయం, అన్లోడ్ చేసిన సమయం.. తదితర వివరాలతో కూడిన రిజిస్టర్ను నిర్వహించాలని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ వ్యవహారాల అధికారులుగా శ్రీనివాస్, రాజేశ్ను నియమించినట్లు వెల్లడించారు. ఇక నుంచి ఫిర్యాదులు వస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. ఇక్కడ నాయబ్ తహసీల్దార్ హరిహర ప్రసాద్ తదితరులు ఉన్నారు.