జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
ఎన్టీపీసీ సీజీఎం సునీల్కుమార్
సీటీసీ ఆర్చరీ అకాడమీకి రూ. 3 లక్షల క్రీడా సామగ్రి అందజేత
కృతజ్ఞతలు తెలిపిన సీపీ కమలాసన్రెడ్డి
రాంనగర్, జూలై 26: కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రం (సీటీసీలో)లో 2014 నుంచి కొనసాగుతున్న ఆర్చరీ అకాడమీకి ఎన్టీపీసీ అండగా నిలిచింది. రూ. 3లక్షల విలువైన క్రీడా సామగ్రిని వితరణ చేసింది. సీటీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్కుమార్ సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డికి క్రీడా పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ ఇక్కడి అకాడమీలో శిక్షణ పొందుతున్న అర్చరీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు అవసరమైన సామగ్రిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సోషల్ రెస్పాన్స్లో భాగంగా అనేక రంగాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ప్రజాహితమే లక్ష్యంగా పోలీస్శాఖ కొనసాగిస్తున్న కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్లోనూ సాయం చేస్తామన్నారు. పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు లక్ష్యాలను నిర్దేశించుకొని సాధనకు కఠోరంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. మొక్కుబడి సాధనతో ఆశించిన ఫలితాలు రావన్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నారని చెప్పారు. ఒలింపిక్ స్థాయి పోటీల్లో పాల్గొనేలా క్రీడాకారులను సిద్ధం చేయాలని నిర్వాహకులకు సూచించారు. క్రీడాసామగ్రి అందించిన ఎన్టీపీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సీటీసీలోని మియావాకీ చిట్టడవులు, హరితహారంలో నాటిన తీరొక్క మొక్కలను చూసి ఎన్టీపీసీ అధికారులు మంత్రముగ్ధులయ్యారు. పర్యావరణ పరిరక్షణకు పోలీసుల కృషిని అభినందించారు. తమసంస్థలో ఇక్కడి విధానాలను అవలంబిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ డీజీఎం డీఎస్ కుమార్, హెచ్ఆర్ విభాగం అధికారి యుగేంధర్రావు, ఎగ్జిక్యూటీవ్ సీఎస్ఆర్ నిశాంత్కిషన్, అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్, ఎసీపీ నాగేందర్, ఇన్స్పెక్టర్ మాధవి, ఆర్ఐలు జానిమియా, శేఖర్, కిరణ్కుమార్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.