పసి పిల్లవాడిలా వ్యవహరిస్తున్నాడు
ఎంపీ అర్వింద్పై ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ధ్వజం
జగిత్యాల, మే 26 : ప్రచారం కోసమే ఎంపీ అర్వింద్ ప్రయత్నిస్తున్నాడని, పసి పిల్లవాడిలా వ్యవహరిస్తున్నాడని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బుధవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అప్పుడే నిద్ర లేచిన పసి పిల్లాడిలా ఎంపీ వ్యవహరిస్తున్నారన్నారు. కొనుగోలు సెంటర్ల ప్రారంభం నుంచి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్న చర్యలు రైతులకు తెలుసన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేస్తున్న సంక్షేమాన్ని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్న పథకాలను ఎంపీ అరవింద్ ఒక్కసారి బేరీజు చేసుకుంటే బాగుంటుందన్నారు. కరోనా సంక్షోభంలో రైతులకు కట్టుబడి ఉన్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, రైతులను ముంచే చట్టాలు తెచ్చిన మీరు సిగ్గుపడాలని హితవు పలికారు. అర్వింద్ వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండు నెలలకోసారి మార్కెట్లో కనిపిస్తూ అధికారులు, ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం ద్వారా ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలో హైలెట్ కావాలనే ఆర్భాటం తప్పా రైతులు, ప్రజలకు ఆయన ద్వారా ఏ మాత్రం మేలు జరగడం లేదని, రానున్న రోజుల్లో జరగదని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించడంతో పాటు కొనుగోళ్లలో ఇబ్బందులు, మిల్లర్లతో సమస్యలను పరిష్కరిస్తూ అధికారులను సమన్వయం చేస్తున్నది కేవలం తామేనన్నారు. ఏనాడైనా ఎంపీ రివ్యూ నిర్వహించారా? అని ప్రశ్నించారు. కరోనా సంక్షోభంలోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నామని, మీ అనాలోచిత విధానంతో కొవిడ్ టీకా దొరకని ఫలితంగా ఎందరో నష్టపోయారన్నారు. జిల్లా లో ప్రధానంగా ఉన్న మామిడి మార్కెట్ వ్యవస్థ కుదేలైందని, దానికి పూర్తి బాధ్యత కేంద్రానిదేనన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు తహసీల్దార్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేసిన వివరాలను ఎమ్మెల్యే మీడియాకు అందించారు. ఎంపీ అరవింద్ది నోరా మోరా అని, ఆయన వ్యాఖ్యలు ఆయనకే వదిలిపెడుతున్నామన్నారు. కనీసం కరోనా టీకాలు సైతం తెప్పించలేని మీరు ఎంపీగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జగిత్యాల రూరల్ ఎంపీపీ పాలెపు రాజేంద్ర ప్రసా ద్, పీఎసీఎస్ చైర్మన్లు మహిపాల్రెడ్డి, సందీప్రావు, పోతా రం పీఎసీఎస్ చైర్మన్ సాగర్ రావు, సర్పంచ్ బోనగిరి నారాయణ, నాయకులు హరీశ్ తదితరులు పాల్గొన్నారు.