ఆడబిడ్డల సంతోషమే సర్కారు ధ్యేయం
సీఎం కేసీఆర్తోనే మహిళా సాధికారత
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్లో సమాఖ్య సంఘాలతో సమావేశం
19 సంఘాలకు రూ.95 లక్షల బకాయి చెక్కుల పంపిణీ
మహిళా భవనానికి రూ.50 లక్షలు మంజూరు
హుజూరాబాద్టౌన్, జూన్ 25:హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 19 సమాఖ్య సంఘాల బకాయిలు 95 లక్షలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. త్వరలోనే మిగిలిన బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని భరోసానిచ్చారు.
ఆడబిడ్డల సంతోషమే సర్కారు ధ్యేయమని, వారికి ఏ కష్టం కలుగకుండా వడ్డీలేని రుణాలు, కల్యాణలక్ష్మి, పొదుపు సంఘాల రుణాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇంత చేస్తున్నా హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాయకుడు మాత్రం ఆడబిడ్డల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇంటికి దీపం ఇల్లాలని, ఆమె బాగుంటేనే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్లోని సాయిరూప ఫంక్షన్హాల్లో శుక్రవారం మాజీమంత్రి బస్వరాజు సారయ్యతో కలిసి మెప్మా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాలకు ప్రభుత్వం రూ.95 లక్షల బకాయి నిధులు విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రి సంఘాల సభ్యులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహిళలు నానా అగచాట్లు పడ్డారని, చిన్నచిన్న అవసరాల కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకునే వారని గుర్తు చేశారు.
ఇలాంటి దయనీయస్థితిని గమనించే ఉద్యమ నేత కేసీఆర్, రాష్ట్రం రాగానే అతివల ఆత్మగౌరవం పెంపునకు అనేక సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేశారని చెప్పారు. పథకాల ఫలాలను మహిళల పేరిటే అందిస్తున్నారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా సమైక్య సంఘాలకు రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. స్థానిక నాయకత్వం వైఫల్యం కారణంగానే బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలి అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఆస్తులను సంపాదించుకున్నాడని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా సంఘాల సమాఖ్య శాశ్వత భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసిన గంగుల, మరో రెండు రోజుల్లో స్థలాన్ని గుర్తించి భూమిపూజ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా మిగిలిపోయిన బకాయిలు రూ.83 లక్షలనూ అతి త్వరలోనే మహిళా సంఘాలకు అందిస్తామని భరోసానిచ్చారు. ఈ దిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పరిగెతో పోల్చినవారికి గుణపాఠం నేర్పాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పరిగెతో పోల్చిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకులు అసెంబ్లీలో ఎండిన వరి కంకులు, కాలిన మోటర్లతో నిరసనలు తెలిపినా పట్టించుకోలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్ నేడు రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నదని, రైతుబంధు, రైతుబీమా లాంటి అనేక పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ పథకాలపై అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న బీజేపీ నాయకులు వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇష్టారీతిగా విమర్శలు చేస్తున్న వారిని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ అభివృద్ధికే పట్టంగడతారని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ.. మహిళా పొదుపు సంఘాలపై ప్రభుత్వానికి ఎంతో విశ్వాసం ఉందన్నారు. మెప్మా సభ్యులకు ఒకే డ్రెస్కోడ్ ఉండేలా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. మహిళలు ఎలాంటి సమస్యలున్నా మంత్రులు, సంబంధిత ఎమ్మెల్యేలు, అధికారులను కలిస్తే పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. కాగా, 110 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు నూతన ఆఫ్రాన్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే ప్రసన్నరాణి, మెప్మా పీడీ రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, మెప్మా ప్రతినిధులు ఏపీడీ శ్రీవాణి, సీఎల్ఆర్పీలు, ఆర్పీలు, కౌన్సిలర్లు కే రమాదేవి, కే లావణ్య, టీ శ్రీనివాస్గౌడ్, ఎం.కుమార్, టీ సదానందం, టీ రాజేంద్రప్రసాద్, ఎం.రమేశ్, పెద్దఎత్తున మహిళలు, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
తలెత్తుకొని బతుకుతున్నం..
నాడు ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డం. కేవలం 200 గౌరవ వేతనంతో వెట్టిచాకిరీ చేసినం. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి మంచి గౌరవం ఇచ్చిండు. పెద్ద మనసుతో 4 వేల వేతనం ఇచ్చి ఆత్మగౌరవం పెంపొందించిండు. ఇప్పుడు తలెత్తుకొని బతుకుతున్నం.