మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి
లోతట్టు ప్రాంతాల పరిశీలన
జగిత్యాల అర్బన్, జూలై 23: లోతట్టు ప్రాంతాల ప్రజలు అధ్యైర్యపడవద్దని మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి అన్నారు. పట్టణంలోని గోవిందుపల్లి, గాంధీనగర్ వార్డుల్లోని లోతట్టు ప్రాంతాలను ఆమె శుక్రవారం పరిశీలించారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోవిందుపల్లి ప్రాంతంలో వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ ప్రాంతంలో రవాణా స్తంభించడంతో పాటు రోడ్లపై నుంచి ఇళ్లలోకి వరద నీరు చేరింది.సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి త్వరలోనే గోవిందుపల్లి వాగు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధ్యక్షురాలు మాట్లాడుతూ, వర్షాకాలం నేపథ్యంలో పురాతన భవనాలు కూలి ప్రాణ, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉందని, శిథిల భవనాల గుర్తింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి తహసీల్దార్తో చర్చించి నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు సహాయం అందించేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేశామని, 9989729888 నంబర్కు ఫోన్ చేస్తే అవసరమైన సలహాలు అందిస్తారని వివరించారు. అత్యవసర సమయాల్లో చిన్న సమస్య ఉన్నా పరిష్కారానికి హెల్ప్లైన్కు సంప్రదించాలని సూచించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 24గంటలు సేవలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బాలె లతా శంకర్, నక్క జీవన్, అల్లె సాగర్, కొలగాని ప్రేమలత, సత్యం, డీఈ లచ్చిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, అశోక్, రాము, విజయ్, తదితరులు పాల్గొన్నారు.