జీవాలకు వైద్యం కోసం రాష్ట్రంలో 100 అంబులెన్స్ల ఏర్పాటు
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హుజూరాబాద్లో రెండో విడుత గొర్రెల పంపిణీ సన్నాహక సమావేశం
28న జమ్మికుంటలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడి
పాల్గొన్న మంత్రులు కొప్పుల, గంగుల
హుజూరాబాద్ రూరల్, జూలై 22: గొల్ల, కుర్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసి.. లక్షాధికారులను చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్ఘాటించారు. గురువారం హుజూరాబాద్ మండలం శాలపల్లి – ఇందిరానగర్లోని దినేశ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన రెండో విడుత గొర్రెల పంపిణీ సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలోని గొల్ల, కుర్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారని చెప్పారు. మొన్నటిదాకా గొర్రెల యూనిట్ ధర రూ. 1,25,000 ఉండేదని, ప్రస్తుతం ధరలు పెరిగినందున రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం యూనిట్ విలువ రూ.1,75,000కు పెంచినట్లు వివరించారు. రెండో విడుత పంపిణీని ఈ నెల 28న హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ప్రారంభిస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలో లబ్ధిదారుల వాటా కింద 2,874 మంది డీడీలు చెల్లించారని, ఇంకా 1500 మంది వెంటనే చెల్లించాలని కోరారు. పంపిణీ చేసిన గొర్రెలకు వైద్యం సాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100 అంబులెన్సులు ఏర్పాటు చేశామని, ఎలాంటి వ్యాధి సోకినా వెంటనే 1098కు ఫోన్ చేస్తే వైద్యులు ఇంటి వద్దకే వచ్చి వైద్యం చేస్తారని చెప్పారు. యాదవులకు కొమురవెల్లి మల్లన్న, కుర్మలకు బీరప్ప దేవుడు ఇష్టదైవమైతే వారిద్దరి స్వరూపమే సీఎం కేసీఆర్ అని తెలిపారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, హైదరాబాద్లో ఐదెకరాల్లో యాదవ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించారని తెలిపారు.
గొల్ల, కుర్మలకు సర్కారు అండ: మంత్రి కొప్పుల
గొల్ల, కుర్మలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నాలుగేండ్ల క్రితం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మొదటి విడుతలో రాష్ట్రంలో 40 లక్షల గొర్రెలను గొల్ల, కుర్మలకు పంపిణీ చేశారని, వాటితో మరో 40 లక్షలు పెరిగాయని మంత్రి తెలిపారు. గొల్ల, కుర్మలను ప్రభుత్వం ఆదుకుంటూ అండగా నిలుస్తున్నదని తెలిపారు. ప్రతి గ్రామంలో గొల్ల, కుర్మల కుటుంబాలు 100 నుంచి 150 దాకా ఉంటాయని, వారందరికీ యూనిట్లు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.
దేశానికే ఆదర్శం: మంత్రి గంగుల
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గొల్ల, కుర్మలను ఆదుకునేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. మొదటి విడుత పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతమైందని, అలాగే రెండో విడుత కూడా విజయవంతంగా అమలు చేస్తామని చెప్పారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, శాసనమండలి సభ్యులు మల్లేశం యాదవ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నరేందర్, యాదవ కుల సంఘ నాయకులు ఉన్నారు.