రాజకీయ నాయకుడి పోలికలే లేవు
అవినీతి పరులకు కేరాఫ్ అడ్రస్లా బీజేపీ
ప్రజలు తగిన బుద్ధి చెబుతరు
కరీంనగర్ మేయర్ వై సునీల్రావు
కార్పొరేషన్, జూన్ 20: కొద్దిరోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు, వ్యవహార శైలి చూస్తుంటే పగటి వేషగాళ్ల లీడర్గా కనిపిస్తున్నారని నగర మేయర్ వై సునీల్రావు ఎద్దేవా చేశారు. ఆయన వ్యవహారశైలి, మాటలను గమనిస్తే ఎక్కడ కూడా రాజకీయ నాయకుడి పోలికలే లేవని దుయ్యబట్టారు. ఆదివారం కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన సాగర్ ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదని, వచ్చిన 7 వేల ఓట్ల కోసం కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎంద రో ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించలేదని మండిపడ్డారు. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీని ప్రజలు ఆదరించలేదని, బండి సంజయ్ బ్యాచ్ పగటి కలలు కనడం తప్ప చేసేదేం లేదని దుయ్యబట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్ స్థానాలు కోల్పోయినా బుద్ది రావడం లేదని, బండి బ్యాచ్ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్లోనూ సాగర్ ఫలితాలే పునరావృతం అవుతాయని, ఇప్పటికే టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వివిధ పార్టీల నుంచి జంపింగ్ బ్యాచ్ చేరితే సంబురాలు చేసుకునే దిక్కుమాలిన పరిస్థితిలో బీజేపీ ఉందని, అది వారి దివాళాకోరు తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
ఆంధ్ర, తెలంగాణ నుంచి అక్రమార్కులను, అక్రమంగా సంపాదించిన వారికి ఆశ్రయం ఇచ్చే పార్టీగా బీజేపీ మారిపోయిందని, సీఎం రమేశ్, సృజనాచౌదరి లాంటివారితో మొదలుకుంటే ఈటల దాకా పరిస్థితి అలాగే ఉందని ఆక్షేపించారు. గడీలను బద్దలుకొట్టుకొని వచ్చారని మాట్లాడుతున్న బండి సంజయ్కి సిగ్గు ఉండాలని, హైదరాబాద్లో 10 ఎకరాల్లో గడీ కట్టుకున్నది మీ పార్టీలో చేరిన ఈటల కదా అని ప్రశ్నించారు. బీజేపీలో మూడు ముక్కలాట నడుస్తున్నదని, ఈటల చేరడం బండి సంజయ్కే ఇష్టం లేదని, తన నీడను కూడా తాను నమ్మే స్థితి లో బండి లేడని విమర్శించారు. కరీంనగర్ వ్యవసాయాధారిత జిల్లా అని, ఇక్కడి రైతులంతా కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. వ్యవసాయానికి సాగునీరు, 24 గంటల కరెంట్, పంట కొనుగోలు, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు ఇస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. గతంలో టేలెండ్ వరకు సాగునీరు అందే పరిస్థితి లేదని, కానీ ఇప్పుడు ఎండకాలంలోనూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లోనూ జలకళ ఉందన్నారు.
ఇది కేవలం సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రాజెక్టులతోనే సాధ్యమైందని చెప్పారు. ఎందుకు పార్టీలు మారుతున్నారో, ఎవరు అవకాశవాద రాజకీయం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి పనులతో ప్రజలంతా అండగా నిలుస్తున్నారన్నారు. గౌరవించే సంస్కారం లేని బండి తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారకులు, పగటి కలలు కనే వారు గతంలోనూ చాలా మందే వచ్చి, కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం జీర్ణించుకోలేకనే తప్పుడు ప్రచారాలు చేసి ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇక్కడ కార్పొరేటర్లు గంట కళ్యాణి, గందె మాధవి, సుధగోని మాధవి, బోనాల శ్రీకాంత్, బండారి వేణు, గుగ్గిళ్ల జయశ్రీ, నాయకులు అర్ష మల్లేశం ఉన్నారు.