ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 12 : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం… మట్టి రోడ్లు, బజార్ల వెంట మురుగు నీరు… మట్టి రోడ్లు, పక్కనే పెంట కుప్పలతో అధ్వానంగా ఉండేది.. రాష్ట్రం సిద్ధించాక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో ముకునూరు గ్రామం కొత్త రూపు సంతరించుకున్నది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో దూసుకెళ్లున్నది. ప్రతి వీధిలో సీసీ రోడ్డును వేయడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. కమ్యూనిటీ భవనాలు, వైకుంఠధామం, వర్మీకంపోస్టు యార్డులనూ నిర్మించారు. గ్రామంలో ‘పల్లె ప్రకృతి వనం’ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను నాటడంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. హరితహారంలో భాగంగా ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట మొక్కలను నాటడంతో పచ్చందంతో పల్లె పరిఢవిల్లుతున్నది. పంచాయతీ నీటి ట్యాంకర్తో నిత్యం నీరు పడుతూ సంరక్షిస్తున్నారు. వ్యవసాయంపై అన్నదాతలు చర్చించుకునేందుకు నిర్మించిన రైతు వేదిక అందుబాటులోకి వచ్చింది. నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామ వీధుల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించడంతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. నాడు మౌలిక వసతులు సరిగా లేక నానా అవస్థలు పడ్డ ముకునూరు గ్రామస్తులు ‘పల్లె ప్రగతి’తో చకచకా అభివృద్ధి చెందడాన్ని చూసి మురిసిపోతున్నారు.
కేటాయించిన నిధులు..
మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణానికి రూ.67 లక్షలను కేటాయించగా, రైతు వేదిక నిర్మాణానికి రూ.22 లక్షలను ఖర్చు చేశారు. జిల్లా పరిషత్ నిధులు రూ.30 లక్షలు, గ్రామపంచాయతీ నిధులు రూ.15 లక్షలు, మండల పరిషత్ నిధులు రూ.2లక్షలు, ఎమ్మెల్యే నిధులు రూ.5లక్షలను అభివృద్ధి పనులకు వినియోగించారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద వచ్చిన రూ.20 లక్షల నిధులతో ఎస్సీ కాలనీలను అభివృద్ధి చేశారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం…
ఎమ్మెల్యే కిషన్రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం. పంచాయతీ పాలక వర్గం, గ్రామస్తుల సమష్టి కృషితో ప్రణాళికను రూపొందించుకుని ప్రగతి వైపు అడుగులు వేస్తాం. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో గ్రామంలో వినూత్న మార్పు వచ్చింది. అన్ని మౌలిక వసతులను సమకూర్చుకున్నాం. సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించుకున్నాం. నిత్యం చెత్తను సేకరించడంతో పాటు ఎక్కడ కూడా కలుపు మొక్కలు లేకుండా తొలగించడంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. గ్రామ శుభ్రతలో పంచాయతీ కార్మికుల పాత్ర అభినందించదగినది.
చాలా సంతోషంగా ఉంది..
‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో త్వరితగతిన గ్రామం అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉన్నది. ఇదివరకు బజార్ల వెంట మురుగు నీరు పారడం, అస్తవ్యస్తంగా మట్టి రోడ్లు, పెంట కుప్పలు, చెత్తాచెదారంతో నానా ఇబ్బందులు పడేవాళ్లం. నేడు పల్లెంతా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఎక్కడా చెత్త లేకుండా శుభ్రంగా ఉన్నది. తాగునీటి కోసం నానా తండ్లాట ఉండే. ఇప్పుడు మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా వేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.