పిల్లలను భారత భవనంలో వెలిగే దివ్వెలుగా వర్ణించారు వేముగంటి. చిన్నారి పెదవులపై చిరునవ్వులు మెరవడాన్ని మించిన ఆనందం లేదు అన్నది ఆయన భావన.
తెలుగు నేల మీద విద్వత్కవి, పుంభావ సరస్వతి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యుల పరిచయం లేని సాహితీవేత్త ఉండరన్నది నిజం. డాక్టర్ సినారె మాటల్లో చెప్పాలంటే ఆయన ‘విద్వత్కవి, వినయభారనమ్ర విద్వన్నిధి.’ తెలుగు పద్యాన్ని అత్యంత ప్రౌఢంగా రాసిన పద్య, గేయకవి, ఆధునిక వచనకవి కూడా. బాలల కోసం ఆయన రాసిన గేయాలు అపూరూపమైనవి.
14 జూలై, 1930న జన్మించారు వేముగంటి. తండ్రి శ్రీమాన్ రంగాచార్యులు, తల్లి రామమ్మ. బాల్యం నుండి వేము గంటిపై తల్లి, తాతల ప్రభావం ఉండేది. ఆ ప్రభావమే వేముగంటితో సాహితీ సేద్యం చేయించింది. బాల్యంలోనే సిద్దిపేట గ్రంథాలయానికి ఆకర్షితులై వీరు ఎక్కువ సమయాన్ని పుస్తకపఠనానికే వెచ్చించారు. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరుగుతున్న సమయంలో విద్యార్థిగా వరంగల్లోని విశ్వేశ్వర సంస్కృత పాఠశాలలో చేరిన వేముగంటి అక్కడ గ్రంథాలయోద్యమం పట్ల ఆకర్షితుడై అందులో చురుకుగా పాల్గొన్నారు.
సంస్కృత అధ్యయనంతో పాటు మాతృభాషపైన మమకారంతో 1950లో ఆంధ్ర సారస్వత పరిషత్తు కళాశాల నుంచి బి.ఒ.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. తెలుగుతోపాటు హిందీపైన ఆసక్తితో ‘హిందీ ప్రేమీ మండలి’లో చేరి అందులోనూ ప్రావీణ్యత సంపాదించారు. ‘హిందీ ప్రేమీ మండలి’కి ఉపాధ్యక్షులుగా కూడా సేవలందించారు. తెలుగు ఉపాధ్యాయునిగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన వేముగంటి 1988లో పదవీ విరమణ పొందారు.
1940 ప్రాంతంలోనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించినప్పటికీ తొలి రచనగా అచ్చయ్యింది 1946లో మీజాన్ పత్రికలో. అటు తన ముందు తరం, ఇటు తన తరువాతి తరంతోనూ సన్నిహిత సంబంధాలు కలిగిన వేముగంటి పాత కొత్తల మేలు కలయిక. మూడుతరాల సాహిత్య వారధి. ఒక్క తెలంగాణలోనే కాదు అఖిలాంధ్రంలోనూ ‘విద్వత్కవి’గా సత్కారాలు అందుకున్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆయన లఘు కావ్యాలు, భక్తి కావ్యాలు, చారిత్రక, దేశభక్తి, ఆధునిక కావ్యాలు రాశారు. పద్యాన్ని కిరీటంగా ఎలా ధరించారో గేయ, వచన కవితలను కూడా అంతే ప్రేమగా సృజన చేశారు. ఇవేకాక స్మృతి కావ్యాలు, అష్టకాలు, దేశభక్తుల ఏకపాత్రాభినయాలు రాశారు. వీరి ‘తిక్కన’ కావ్యాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాచ్య పరీక్షల విభాగం, ‘ఆంధ్ర విష్ణువు’ చారిత్రక కావ్యాన్ని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరీక్షల విభాగం పాఠ్యాంశాలుగా స్వీకరించాయి.
పద్య గేయాలే కాక పిల్లల కోసం అంతే ప్రేమతో గేయాలను కూడా రాయడం ఉపాధ్యాయునిగా ప్రతిరోజు ఏ పిల్లలకైతే పాఠాలు చెబుతున్నారో వారిపట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం. 1979 అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా తెలుగుతోపాటు అన్ని భారతీయ భాషల్లో లబ్ధప్రతిష్టులైన కవులు బాల సాహిత్యాన్ని సృజించి పిల్లలకు కానుకగా అందించారు. ఆ సందర్భంగా పిల్లల కోసం వేముగంటి ‘తెలుగు బాలనీతి’ శతకాన్ని కూర్చారు. ‘తెలుగుబాల సుగుణకలిత’ అనే మకుటం కలిగిన ఈ శతకం బాలబాలికలకు బాల్యంలోనే నేర్చుకుని, అలవర్చుకోవాల్సిన నీతి, రీతి, మంచితనం, మానవీయ విలువలను ఒక కానుకగా అందించారు. మహాకవి గురజాడ చెప్పినట్టు ‘దేశమంటే మనుషులోయ్’ అన్న మాటను అచ్చంగా నమ్మి ‘దేశమంటే జనం’ అంటూ చెబుతూనే తనదైనదిగా ‘దేశమంటే మనం’ అంటారు వేముగంటి. బాలలు దీక్షతో కృషి చేస్తే దేశం పురోభివృద్ధిని సాధిస్తుందని, ‘భావి భారత భాగ్యోదయం’లో పిల్లలే ప్రధాన పాత్రధారులని, సూత్రధారులని నమ్మి అంతే నమ్మికతో తన గేయాల ద్వారా అందుకు సిద్ధంకమ్మని, అందులో భాగం పంచుకొమ్మని పిల్లలకు ఉద్భోదిస్తారాయన.
డాక్టర్ వేముగంటి పండిత కవి. ఉర్దూ, సంస్కృతం, తెలుగు చదువుకున్నారు. కానీ, ఆయన పిల్లల కోసం రాసిన గేయాలు చూస్తే అంతటి మహా పండితుడు ఇంత సరళంగా ఎలా రాసాడా అన్ని ఆశ్చర్యం కలగకమానదు. అది వారి ప్రతి గేయంలో కనిపిస్తుంది. ‘తెలుగు భాష’ పేరుతో ఆయన రాసిన గేయం చూద్దాం. వేముగంటి మాటల్లో ‘తెలుగు భాష’ ఎటువంటిదటా అంటే -‘పలుకు పలుకులోన / అమృతము చిలికించు /పదము పదములోన/పాటలు పలికించు’ అమృతతుల్యమైన భాష నట. గొప్పతనాన్నే కాక భాషపట్ల పిల్లల కర్తవ్యాన్ని ఇలా చెబుతారు. ‘తెలుగు మాట పలికి/ తెలుగు తేనె లొలికి/ తెలుగు బాల బాధ్యత’ అంటూ వేముగంటి పిల్లల కోసం చెప్పారు. కానీ ఇది మనందరి బాధ్యత కూడా.
‘వాన’ అనే గేయంలో, ‘వాన కురిసె జోరుజోరు/వరదవచ్చె వాగుపారె’, ‘కాల్వ నీట తేలియాడె/పిల్లలేమొ సంతసమున’ వాళ్లు నీళ్లతోని ఆడుకున్నారని అంటారు. తొలినాళ్ల నుండి కవులు అమ్మపై కవిత్వం రాయటం మనం చూస్తున్నాం. అమ్మ గొప్పదనాన్ని, ప్రేమను ఎంత వర్ణించినా ఎప్పటికీ వొడవని ముచ్చటనే. అందులోనూ పిల్లల కోసం రాసినప్పుడు ‘అమ్మ’ను, ‘చందమామ’ను గురించి రాయకుండా ఉండలేము. వేముగంటి కూడా ‘అమ్మ’ అనే చక్కని గేయాన్ని రాశారు. రాయడమే కాదు అమ్మకు ఆయన ఇచ్చిన నిర్వచనం చాలా గొప్పగా ఉంది.
‘అమ్మ మనకు దైవమురా!/ అమ్మ ప్రేమ రూపమురా!/ అమ్మవంటి దేవత ఈ / అవనిలోన లేదురా!’ అంటారు. ‘అమ్మను మించి దైవమున్నదా/ ఆత్మను మించి అద్దమున్నదా’ అనే ఇటీవలి సినిమా పాట మనకు తెలిసిందే. వేముగంటి 1979లోనే ఈ గేయం రాశారు. ఇక మరో అంశం చందమామ, వెన్నెల. వేముగంటి వెన్నెల గురించి బాల గేయం రాశారు.
అందులో ఆయన వెన్నెలను, నిండు పున్నమి రేయి ‘నీలాల నిగ్గుల / నింగి పళ్ళెము నుండి/కలికి వెన్నెల పాలు/ఒలకబోశాడు’ అని చెబుతారు. ఎంత చక్కని వర్ణన. ఇది వేముగంటి వారికే చెల్లింది. స్నేహితుల గురించి, మానవత్వం గురించి, బంధాలు, అనుబంధాల గురించి ఇందులో ఒక యజ్ఞంలాగా వేముగంటి చెప్పడం చూడవచ్చు. అందులో ప్రధాన ఉద్దేశం బాల్యం నుండే పిల్లల్లో మానవతా బీజాలు వేయడమే. అంతా ఒక్కటే అనే భావన పిల్లల్లో రావాలని, తద్వారా ఐక్యతాబీజాలు వారిలో మొలకెత్తాలని ఆకాంక్షిస్తారు. ‘అందరూ ఒకటే, అంతా ఒక్కటే’ అని భావించిన కవి పిల్లలకు దానిని బోధిస్తారు తన గేయాల ద్వారా.
‘హరిజనులైనా, గిరిజనులైనా / అందరు మన సోదరులే/ ముస్లింలైనా, క్రైస్తవులైనా/అందరు మన బంధువులే’ అని చెప్పిన వేముగంటి పిల్లలకు చక్కని ప్రవర్తనను గురించి నేర్పిస్తారు. ఒక బాధ్యత కలిగిన ఉపాధ్యాయునిగా. అదీ అలతి అలతి పదాలతో చెబుతారు. నీతి, న్యాయం గలిగి నిష్ఠతో మెలగాలి, కులభేదములు మాని, మతవాదముము వీడి, సమత మమతను గలిగి సహనము చూపాలి అంటారు. పువ్వుల గురించి, పిల్లల నవ్వుల గురించి అందంగా చెప్పిన కవి, ‘పిల్లల మనసులు /తెల్లన తెల్లన/ పిల్లల చూపులు/చల్లన చల్లన/పిల్లల మాటలు/తీయన తీయన’ అని చెబుతారు. ఇటువంటిదే మరో మంచి గేయం ‘రంగులు’. రంగులను పిల్లలకు ఇలా కూడా పరిచయం చేయొచ్చా అనిపిస్తుంది. దానిని వేముగంటి సాధించి చూపించారు. ‘శాంతి తెల్లన/సత్యం పచ్చన/న్యాయం పసిమి/స్వేచ్ఛ ఎర్రన/కరుణ నీలము/రమ్య గుణాలకు/రంగులు గుర్తులు/బాలల మనస్సు/ఇంద్ర ధనుస్సు’ అంటారాయన. ఇంతకంటే ఏ రంగుల్లో, ఏ అక్షరాల్లో, గేయాల్లో పిల్లలకు బోధించగలం. 1947లో అచ్చయిన తొలి గ్రంథం ‘ప్రభోదము’ నుండి ‘తెలుగు తెలివిడి’ వరకు నలభైకి పైగా గ్రంథాలు రాసిన డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు పిల్లల కోసం తెలంగాణలో పరితపించి రాసిన కవి, ఆదర్శ ఉపాధ్యాయుడు, పాత కొత్తల వారథి. డాక్టర్ బెల్లంకొండ సంపత్కుమార్ అన్నట్టు ‘పద్య నడకలో, ఆధునికతలో మరో దాశరథి’
బాలల దినోత్సవం విశిష్టత పిల్లలకు తెలియాలని ‘బాలల పండుగ’లో వేముగంటి చెబుతారు. ‘పండిత నెహ్రూ పుట్టిన రోజు. బాలల పండుగ రోజు అది. బాలల కెంతో మోజు’ అని చెబుతూ బాలల పండుగ ‘సిరి వెన్నెల పండుగ రోజు’ అంటారు. ఆటపాటలతో, అనందంగా, సంతోషంగా ఎదిగే బాల్యానికి ఇది అసలైన పండుగని ఆయన ఆంతర్యం.
-డాక్టర్ పత్తిపాక మోహన్
(వ్యాసకర్త నేషనల్ బుక్ ట్రస్ట్ కేంద్ర విద్యామంత్రిత్వశాఖలో తెలుగు సహాయ సంపాదకులు)
(జూలై 14 డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు 91వ జయంతి)