ముంబై: శిఖర్ ధావన్ నేతృత్వంలోని ఇండియన్ క్రికెట్ టీమ్ సోమవారం శ్రీలంక టూర్ కోసం వెళ్లింది. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విటర్లో వెల్లడించింది. ఈ టూర్లో భాగంగా ఇండియా, శ్రీలంక 3 వన్డేలు, 3 టీ20ల్లో తలపడనున్నాయి. జులై 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టీమ్కు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ ధావన్తో కలిసి అతడు ఆదివారం మీడియాతో మాట్లాడాడు. టీ20 వరల్డ్కప్ ఈ ఏడాది చివర్లో ఉన్న నేపథ్యంలో ఈ టూర్లో సత్తా చాటాలని సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లాంటి యువకులు భావిస్తున్నారు. వరల్డ్ కప్ టీమ్ వీరి లక్ష్యమైనా ముందు సిరీస్ గెలవడంపైనే దృష్టి సారించాలని కోచ్ ద్రవిడ్ చెప్పాడు.
ఈ వన్డే, టీ20 సిరీస్లకు శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తొలిసారి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధావన్ భావిస్తున్నాడు. ఇండియన్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించడం గొప్ప గౌరవమని అతడు అన్నాడు.
శ్రీలంక టూర్కు వెళ్లిన టీమ్ ఇదే: శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కే గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరున్ చక్రవర్తి, భువనేశ్వర్కుమార్, దీపక్ చహర్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా