హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో విద్యార్థులకు ఏలోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సీ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన గురుకుల విద్యాలయాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో విద్య అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. అదే స్ఫూర్తితో పనిచేసి గురుకులాల ప్రతిష్ఠను మరింత పెంచాలని సూచించారు. జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సోమవారం మసాబ్ ట్యాంక్లోని సంక్షేమభవన్లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యాసంస్థలు, హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు చూసుకోవాలని, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే తక్షణమే స్పందించాలని సూచించారు. పాఠ్యపుస్తకా లు, నోటు పుస్తకాలతో సహా హాస్టళ్లు ప్రారంభించేనాటికి అన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇంకా వ్యా క్సిన్ తీసుకోని గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకు లు, ఇతర సిబ్బందికి టీకాల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 మహిళా డిగ్రీ కళాశాలలు ప్రారంభించుకున్నామని, పురుషుల డ్రాప్ అవుట్స్ను తగ్గించి వారికి ఉన్నత విద్యను అందించేందుకు వీలుగా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనువైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా హాస్టళ్లలో డైట్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వ ఆలోచిస్తున్నదని తెలిపారు. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ రూ.1,000 కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీంను ప్రకటించిన నేపథ్యంలో ఈ పథకానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. సమీక్షలో మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్, ప్రభుత్వ కార్యదర్శులు రాహుల్ బొజ్జ, అహ్మద్ నదీమ్, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.