హైదరాబాద్ : పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం కుత్భుల్లాపూర్లోని ఆరు చెరువులు, బంజారాహిల్స్ రోడ్ నెంబరు-1లోని తాజ్ బంజారా సమీపంలో ఉన్న చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్విట్టర్లో పౌరులు లేవనెత్తిన చెరువుల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తగిన పరిష్కారాలు కనుగొనాల్సిందిగా మేయర్, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
అట్లూరి కుమార్ అనే వ్యక్తి సింగిడికుంట లేదా తాజ్ బంజారా చెరువు ఫోటోలను అటాచ్ చేసి మంత్రిని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం చెరువు చుట్టూ ఉన్న పరిస్థితి తెలిపాడు. నీటి ప్రవాహానికి చెరువును, నాలాను శుభ్రపరచడం ఎంతైనా అవసరమని పేర్కొన్నాడు. రత్న రాజ్ అనే మరొక వ్యక్తి గాజులరామారం చెరువుల గురించి తెలియజేస్తూ మంత్రిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. చెరువు ఏడాదికేడాది కుచించుకుపోతుందని, చెరువును శుభ్రపరిచి చుట్టూ నడకమార్గాన్ని ఏర్పాటు చేస్తే బాగుందని తెలిపాడు. ఈ సమస్యలపై మంత్రి తక్షణం స్పందించారు.
మంత్రి ఆదేశాలతో జోనల్ కమిషనర్ మమత, గాజుల రామారం కార్పొరేటర్ రావులా శేషగిరితో కలిసి మేయర్ కుత్భుల్లాపూర్లోని ఆరు చెరువులను పరిశీలించారు. అనంతరం అక్కడినుండి బయల్దేరి జోనల్ కమిషనర్ ప్రవీణ్యతో కలిసి బంజారాహిల్స్ చెరువును తనిఖీ చేశారు. చెరువులను శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చెరువు చుట్టూ నడక మార్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా సూచించారు.