ఖమ్మం : ప్రియుడితో కలిసి భర్త ఇంట్లోనే భార్య భారీ దొంగతనానికి పాల్పడింది. బంగారం, వెండి, ల్యాప్టాప్ మొత్తం రూ.63 లక్షల సొత్తును అపహరించింది. ఇదేంటి భర్త ఇల్లు తన ఇల్లు కాదా? భర్త సంపద ఆమెది కాదా? సొంత ఇంట్లో దొంగతనం ఏంటీ అనుకుంటున్నారా? ఖమ్మం జిల్లా కారేపల్లిలో చోటుచేసుకుంది ఈ ఘటన. సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన అర్చన, ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన శివప్రకాశ్లకు 2008లో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కుటుంబ గొడవల కారణంగా అర్చన తల్లిగారింటికి వెళ్లి వేరేగా ఉంటుంది. అక్కడే ఏడాదిన్నర కాలంగా బాతుల వెంకటకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
నెల రోజులక్రితం భర్త తల్లి చనిపోతే ఇక్కడికి వచ్చింది. ఇంట్లో పరిస్థితులను గమనించిన పిమ్మట తన ప్రియుడికి ఫోన్ చేసి రమ్మంది. ప్రియుడు ప్రసాద్ మే 3వ తేదీన ఖమ్మం వచ్చి రైల్వే స్టేషన్లోనే బస చేశాడు. మే 4వ తేదీ రాత్రి ఇంట్లోని బంగారం, వెండి, ల్యాప్టాప్ అన్ని మూట కట్టి ప్రియుడికి ఇచ్చింది. వాటిని అమ్మి నగదును భద్రపరచమంది.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఖమ్మం సీసీఎస్, కారేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాలు, ఇతర వివరాల ఆధారంగా భార్యపై అనుమానం కలిగి పోలీసులు విచారించారు. విచారణలో చేసిన నేరాన్ని ఒప్పుకుంది. నిందితుల వద్ద నుండి పోలీసులు 1224.89 గ్రాములు బంగారం, 2349 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వియజవంతంగా దర్యాప్తు చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు పి. నవీన్, ఇ.శ్రీనివాస్, కారేపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్ సురేశ్, కానిస్టేబుళ్లు కె. శ్రీనివాస్, బి.మంగ్త్య, ఎం.గజేంద్ర ను సీపీ అభినందించారు.