హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): డిమాండ్కు తగినట్టుగా కొవాగ్జిన్ ఉత్పత్తిని పెంచడంపై భారత్ బయోటెక్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (ఐఐఎల్) సాయం తీసుకోనున్నట్టు తెలిసింది. కొవాగ్జిన్ యాంటీజెన్ను (న్యూట్రలైజ్ చేసిన వైరస్) ఐఐఎల్ ఉత్పత్తి చేసి భారత్ బయోటెక్కు సరఫరా చేయనున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జూన్ రెండోవారంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, జూలైలో భారత్ బయోటెక్కు అందిస్తుందని పేర్కొన్నాయి. భారత్ బయోటెక్ ఈ యాంటీజెన్ను ప్రాసెసింగ్ చేసి, వయల్స్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఇందుకోసం ఒకటి రెండు నెలల సమయం పడుతుందని అంచనా. ఐఎల్ఎల్ ప్రతినెల కోటి డోసుల యాంటీజెన్ను ఉత్పత్తి చేయనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఐఐఎల్ ఇటీవల తమ ‘బీఎస్ఎల్ 2+’ ల్యాబ్ను ‘బీఎస్ఎల్ 3’కు అప్గ్రేడ్ చేసినట్టు తెలిసింది.