కరోనా..బ్లాక్ ఫంగస్..వీటి పేర్లు వినగానే జనం కొంత ఆందోళనకు గురికావడం సహజం. వీటి బారినపడిన వారు ఏ మందులు వాడాలి..? ఎవరిని సంప్రదించాలని అన్న టెన్షన్లో ఉంటారు. మరికొందరు వైద్యులు రాసే మెడిసిన్స్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటారు. ఇలాంటి అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. కరోనా, బ్లాక్ ఫంగస్కు మందులు ఉన్నాయంటూ.. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. అంతేకాదు.. ఎక్కువగా వైద్యులు ఏ మందులు రాస్తున్నారో వాటిని కూడా తక్కువ ధరకే అందిస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ముందస్తుగా డబ్బులు చెల్లిస్తే 24 గంటల్లో పంపిస్తామని నమ్మిస్తున్నారు. ఆప్తుల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో వారి వలలో చిక్కుతున్న వారు.. లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరింత మానసికంగా కుంగిపోతున్నారు. ఉత్తరాది ముఠాలు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మల్కాజిగిరికి చెందిన ఓ వ్యాపారి స్నేహితుడు కొవిడ్, బ్లాక్ ఫంగస్ బారిన పడి బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. అతడికి లిపోసోమాక్ ఆమ్ఫొటెరిసిన్ మందు కావాలని వైద్యులు అడిగారు. దీంతో సదరు వ్యాపారి ఆ మందు కోసం ఆన్లైన్లో వెతికాడు. అందులో ఓ సంస్థ వద్ద ఈ మందు ఉన్నట్లు ప్రకటన చూసి.. నంబర్ను సంప్రదించగా, ముందే డబ్బులు పే చేయాలని సూచించడంతో ఎనిమిది వయల్స్ కావాలంటూ.. రూ. 1.58 లక్షలను ఆన్లైన్లో చెల్లించాడు. అత్యవసరంగా ఆ మందులు అవసరం ఉండటంతో వాటికి కోసం ఎదురు చూస్తుండగా, ఎంతకు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
సైబర్ నేరగాళ్లు తాజాగా నెలకొన్న పరిస్థితులను అవకాశంగా మార్చుకుంటున్నారు. కొవిడ్, బ్లాక్ ఫంగస్కు మందులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రకటనలతో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఈ ప్రకటనలను చూసి చాలా మంది వారి మాయలో పడుతున్నారు. ఆన్లైన్లో మందులు కొనే సమయంలో ముందుగా డబ్బు చెల్లించండి.. తర్వాత మందులు పంపిస్తామంటే.. అది మోసమేనని గ్రహించాలి. అలా ఎవరైనా సూచిస్తే.. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ను ఎంచుకోవాలి. లేదా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేయాలి. -హరినాథ్, ఏసీపీ, రాచకొండ సైబర్ క్రైం విభాగం