సమకాలీన తెలుగు సినిమాకు హద్దులు చెరిగిపోతున్నాయి. పాన్ఇండియా స్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది. వసూళ్లపరంగా టాలీవుడ్ దేశంలోనే రెండో పెద్ద పరిశ్రమగా పేరుతెచ్చుకోవడంతో పరభాషలకు చెందిన అగ్రతారలు కూడా తెలుగు సినిమాల్లో భాగమవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. హిందీతో పాటు మలయాళ, కన్నడ చిత్రసీమల్లో అగ్ర నాయికలుగా వెలుగొందుతున్న భామలు తెలుగులో అరంగేట్రం చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
బాలీవుడ్లో వైవిధ్యతకు చిరునామాగా నిలుస్తోంది అలియాభట్. సవాళ్లతో కూడిన ప్రయోగాత్మక చిత్రాలు, నటనకు ప్రాముఖ్యమున్న పాత్రలతో హిందీ చిత్రసీమలో అగ్రనాయికల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నదీ ముద్దుగుమ్మ. తాజాగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగులో తొలి అడుగు వేయబోతున్నదామె. తొలితరం స్వాతంత్య్రసమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీం జీవితాలకు ఫిక్షనల్ అంశాల్ని జోడిస్తూ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రామ్చరణ్ జోడీగా సీత పాత్రలో అలియాభట్ నటిస్తోంది.ధృడమైన సంకల్పం, త్యాగగుణంతో సంప్రదాయబద్దంగా ఆమె పాత్ర సాగుతుందని సమాచారం. గొప్ప సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయబోతుండటం ఆనందంగాఉందని అంటోంది అలియాభట్.
దీపికా పడుకొన్ తెలుగు అరంగేట్రం గురించి అప్పట్లో చాలా వార్తలొచ్చాయి. గతంలో మహేష్బాబు, ఎన్టీఆర్తో పాటు పలువురు అగ్రహీరోల సినిమాలో నాయికగా ఈ సొగసరి పేరు వినిపించింది. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ప్రభాస్ సినిమాతో ఆ నిరీక్షణకు తెరపడింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా ఓ పాన్ ఇండియన్ చిత్రం తెరకెక్కనుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా దీపికా పడుకోన్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇందులో రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా విలక్షణమైన క్యారెక్టర్లో దీపికా కనిపించబోతున్నట్లు సమాచారం. అమితాబ్బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా సెట్స్పైకి రావడం ఆలస్యమవుతోంది.
అభినయం కంటే అందచందాలతో బాలీవుడ్లో చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్నది ఊర్వశి రౌతేలా. గ్లామర్ను ఒలికించే విషయంలో తనకు ఎలాంటి హద్దులు లేవని చాటిచెప్పిన ఆమె ‘బ్లాక్రోజ్’ సినిమాతో తెలుగుచిత్రసీమకు పరిచయం కాబోతుంది. మహిళా ప్రధాన కథాంశంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు సంపత్నంది కథను అందిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది.
అల్లరి, అమాయకత్వం, అందం కలబోసిన పాత్రలతో తమిళం, మలయాళ భాషల్లో యువతరం ఆరాధ్యనాయికగా పేరుతెచ్చుకున్నది నజ్రియానజీమ్. అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఆమె తాజాగా టాలీవుడ్లో ఓ స్ట్రెయిట్ సినిమా చేస్తోంది. నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అంటే సుందరానికి’. వినోదభరిత కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా నజ్రియానజీమ్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్లో అడుగుపెట్టిన నజ్రియా తొలి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమేనని చెబుతోంది.
కన్నడ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా రచితారామ్ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ సుందరి పన్నెండు కన్నడ సినిమాల్లో నటిస్తుంది. తిరుగులేని స్టార్డమ్, ఫాలోయింగ్తో కన్నడ చిత్రసీమలో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ‘సూపర్మచ్చి’ సినిమాతో తెలుగులో తన అదృష్టాన్నీ పరీక్షించుకోనుంది. కల్యాణ్దేవ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.