400 మంది పోలీసులతో లాక్డౌన్ విధులు
ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర
బందోబస్తు పర్యవేక్షణ
ఎదులాపురం, మే 12 : ఎవరైనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. లాక్డౌన్ మొదటి రోజు జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల రాకపోకలను వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఇన్చార్జి ఎస్పీ స్వయంగా పట్టణంలో పలు ప్రధాన కూడళ్ల వద్ద పరిస్థితిని సమీక్షించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో లాక్డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడానికి ప్రణాళిక ప్రకారం బందోబస్తు సిబ్బందిని మూడు షిప్టులుగా విభజించి విధులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర ప్రయాణాలు చేసే వారి కోసం ఈ పాసులు జారీ చేస్తారని తెలిపారు.
ఇతర రాష్ర్టాలకు వేళ్లే వారే కాకుండా, రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేవారు కూడా పాసులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందు కోసం తెలంగాణ పోలీస్ వెబ్ సైట్ https://policeportal.tspolice. gov.in లో దరఖాస్తు చేసుకుంటే మూడు గంటల్లోనే ఆన్లైన్ లోనే అనుమతులు జారీ అవుతాయని వివరించారు. ఇతర రాష్ర్టాల నుంచి సరిహద్దుల గుండా జిల్లాలో ప్రవేశించే వారు ఆయా రాష్ర్టాల నుంచే పాస్ తీసుకొని రావాలన్నారు. ఎస్పీ వెంట ఏఆర్ అదనపు ఎస్పీ బీ వినోద్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వీపూరి సురేశ్, సీఐ మల్లేశ్, పోతారం శ్రీనివాస్, రామకృష్ణ, రామనరసింహారెడ్డి, పురుషోత్తమాచారి, రిజర్వ్ సీఐ సుధాకర్రావు, గడి కొప్పుల వేణు, ఎస్ఐలు పాల్గొన్నారు.