హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని టూరిస్ట్ ప్రదేశాలు, హోటళ్లు, కాటేజీలు మూసివేయనున్నారు. కరోనా రెండో వేవ్ నేపథ్యంలో సహజంగానే టూరిస్టులు రావడం లేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కాస్త హడావుడి కనిపించినా.. ఏప్రిల్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది తొలి మూడు నెలలు హైదరాబాద్లోని లుంబినీపార్క్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ తదితర ప్రాంతాలకు పర్యాటకులు భారీగా వచ్చారు. లుంబినీ పార్కుకు వారాంతాల్లో 10వేల నుంచి 15వేల మంది వస్తే.. రూ.5 లక్షల ఆదాయం వచ్చేది. కానీ ఏప్రిల్ నుంచి పర్యాటకులు చూద్దామన్నా కనిపించడం లేదని పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు అధికారిక లాక్డౌన్తో వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. పర్యాటక శాఖకు సాధారణ రోజుల్లో నెలకు రూ.6 కోట్ల కలెక్షన్లు ఉంటాయి. కరోనాతో గతేడాది దాదాపు ఆరు నెలలు ఎలాంటి వసూళ్లు లేవు.