ఐదేండ్లలో ఎంతో ఉపశమనం
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 10 కేంద్రాలు
భరోసా కేంద్రం ఏర్పాటై ఐదేండ్లు పూర్తి
ఆపదలో ఉన్న వారికి భరోసా ఇవ్వడంలో హైదరాబాద్ భరోసా కేంద్రం ఎప్పుడు ముందుంటుందని, ఐదేండ్లలో సుమారు 10 వేల మంది బాధితులకు సాంత్వన చేకూర్చినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఆపదలో ఉన్న మహిళలు,పిల్లల కోసం నాంపల్లి హాకాభవన్లో ఏర్పాటు చేసిన ‘భరోసా’ కేంద్రం ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు,న్యాయవాదులు భరోసా కేంద్రం పనితీరును మెచ్చుకున్నారని, పాతబస్తీలో నూతన భరోసా భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. నగరంలో మరో 13 కొత్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, దీనివల్ల హాకాభవన్లోని భరోసా కేంద్రంపై ఒత్తిడి తగ్గనుందని వెల్లడించారు.
అదనపు డీజీ స్వాతిలక్రా మాట్లాడుతూ పోక్సో కేసులో ఓ తల్లి భరోసా కేంద్రానికి వచ్చినపుడు గుడిలోకి వచ్చినట్లు అనిపించిందని మాట్లాడిందని, అంతటి భరోసా ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందిస్తున్నాయని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 10 భరోసా కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. మన భరోసా కేంద్రం చాలా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని, కర్ణాటక, జమ్మూకశ్మీర్లో మనలాంటి భరోసా కేంద్రాలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. అనంతరం ఐదేండ్లుగా భరోసా కేంద్రానికి వివిధ కేసుల్లో వచ్చిన వారి వివరాలను భరోసా కేంద్రం ఇన్చార్జి, అదనపు సీపీ శిఖాగోయల్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంతకుముందు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, షీ టీమ్స్ అదనపు సీపీ శిరీష తదితరులు పాల్గొన్నారు.