ధారూరు, మే 7 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు, పల్లె ప్రగతిలో భాగంగా 30 రోజుల ప్రణాళికతో అభివృద్ధి పరుగులు తీసింది. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంటికో ఇంకుడు గుంత, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగు నీరు, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో పారుశుధ్య పనుల నిర్వహణతో గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం దోర్నాల్ గ్రామ రూపురేఖలను మార్చింది. ప్రజాప్రతినిధులు, గ్రామకమిటీ సభ్యులు, గ్రామ ప్రజలతో పాటు అధికారులు ఉత్సాహంగా లక్ష్య సాధనకు విస్తృతంగా అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు చేపట్టడంతో దోర్నాల్ గ్రామం అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నది.
పారిశుద్ధ్య నిర్వహణతో స్వచ్ఛ వీధులు
పల్లె ప్రగతిలో భాగంగా పల్లె పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను కొనుగోలు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు.
సీసీ రోడ్లు, వీధిదీపాలు
గ్రామంలో రూ.8లక్షలుతో సీసీ రోడ్లు, హైమాస్ట్ బల్బులతో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.
ఇంటింటికీ తాగునీరు సరఫరా
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తున్నారు. గ్రామంలోనే మిషన్ భగీరథ నీటి ట్యాంక్ ఏర్పాటు చేశారు.
పాడుబడ్డ బావుల పూడ్చివేత..
గ్రామంలో పురాతన ఇండ్లు, పాడుబడ్డ బావులను పూడ్చివేశారు. ముండ్ల కంపను తొలగించి శుభ్రం చేశారు.
గ్రామంలో పచ్చదనం
పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామంలో నర్సరీలో 11వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలను వచ్చే హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. నర్సరీలో 11వేలు మొక్కలను పెంచుతున్నారు. పల్లె ప్రకృతి వనంలో 16వందల మొక్కలు నాటి పెంచుతున్నారు. ప్రకృతి వనంలో కొబ్బరి, అశోక, అల్లనేరెడు, చైనా బాదం, ఇతర మొక్కలు నాటి వాటిని కాపాడుతున్నారు. నాటిన మొక్కలకు ప్రతి దినం నీరు అందిస్తున్నారు. ప్రభుత్వ స్థలం, దేవాలయాలు, పాఠశాల ఆవరణలోనూ, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుంటున్నారు.