పరిగి, మే 7 : పరిగి మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఇంటింటా జ్వర సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి మున్సిపల్ పరిధిలోని 15వార్డుల్లో 5500 గృహాలు ఉండగా, 1700పైచిలుకు ఇండ్లల్లో సర్వేను పూర్తిచేశారు. పరిగి మండల పరిధిలోని 37 గ్రామ పంచాయతీల్లో రెండో రోజు 5615 కుటుంబాల సర్వేను పూర్తిచేశారు. ఈ సందర్భంగా 221 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
గ్రామంలో జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సర్పంచ్ కె. రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం దోమ పంచాయతీ కార్యాలయంలో అంగన్వాడీ, ఆశవర్కర్లు, మహిళా సంఘాల సిబ్బంది గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటా సర్వేపై సర్పంచ్ సమావేశం ఏర్పాటు చేసి సర్వేలో చేపడుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుండాల తండాలో అంగన్వాడీ టీచర్ మంజుల ఆరోగ్యపరిస్థితిపై ఇంటింటా సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేశారు. కార్యక్రమంలో దోమ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, మహిళలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కులకచర్ల మండలంలో..
మండలంలో ఇంటింటా ప్రత్యేక వైద్య బృందాలు జ్వర సర్వేను నిర్వహిస్తున్నాయి. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలో సర్పంచ్ సౌమ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఇండ్లలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అనారోగ్యానికి గురైన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తున్నారు. కామునిపల్లి గ్రామంలో సర్పంచ్ పాల మహిపాల్రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ వెంకట్ ఇంటింటా జ్వర సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.