ఐపీఎల్లో కరోనా బాంబు పేలింది. పటిష్టమైన బయోబబుల్ ఏర్పాట్ల మధ్య జరుగుతున్న 14వ సీజన్లో వైరస్ కేసులు వెలుగుచూడడంతో తీవ్ర కలకలం రేగింది. కోల్కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్కు కరోనా సోకడంతో బెంగళూరుతో ఆ జట్టు సోమవారం ఆడాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. మరోవైపు చెన్నై బృందంలో ఇద్దరికి వైరస్ వచ్చినట్టు తేలగా.. పరీక్షల్లో
గందరగోళం ఫ్రాంచైజీల్లో గుబులు రేపుతున్నది. మొత్తంగా ఐపీఎల్ సజావుగా కొనసాగుతుందా.. లేదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్కు కరోనా వైరస్ దెబ్బపడింది. పటిష్టమైన బయోబబుల్ను దాటుకొని టోర్నీ మధ్యలో మహమ్మారి ప్రవేశించింది. కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. దీంతో సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా మధ్య జరుగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్లోనూ కరోనా కేసులు వెలుగుచూడడంతో తీవ్ర ఆందోళన రేగింది. ‘గత నాలుగు రోజుల్లో నిర్వహించిన మూడో రౌండ్ పరీక్షల్లో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్కు వైరస్ పాజిటివ్గా తేలింది. మిగిలిన ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చింది’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా అహ్మదాబాద్లోని ఓ హోటల్లో కోల్కతా బృందమంతా కఠిన క్వారంటైన్లోకి వెళ్లింది. మరోవైపు వైరస్ బారిన పడిన వారు ఆరు రోజుల క్వారంటైన్ తర్వాత మూడుసార్లు పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. గత నెల 29 తేదీన అహ్మదాబాద్ వేదికగా కోల్కతాతో ఢిల్లీ మ్యాచ్ ఆడడంతో ఆ జట్టులోనూ కలవరం మొదలైంది.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో కరోనా తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ఆదివారం పరీక్షలు చేయగా జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ బాలాజీ, ఓ బస్ డ్రైవర్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే ఇవి ఫాల్స్ పాజిటివ్ అని బీసీసీఐకు చెందిన ఓ అధికారి సోమవారం చెప్పడం అయోమయానికి దారితీసింది. కాగా మరోసారి నిర్వహించిన ఆర్టీ పీసీఆర్లో బాలాజీతో పాటు ఓ క్లీనర్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే మిగిలిన ఆటగాళ్లకు, బృందానికి నెగెటివ్ వచ్చినట్టు జట్టు వర్గాలు తెలిపాయి.
కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ను ఆరు నగరాలకే పరిమితం చేసిన బీసీసీఐ.. ఏకకాలంలో రెండు వేదికల్లో మ్యాచ్లు జరిగేలా షెడ్యూల్ రూపొందించింది. బయోబబుల్లో ఏప్రిల్ 9న మొదలైన టోర్నీలో తొలి అంచె మ్యాచ్లు ముంబై, చెన్నైలో జరిగాయి. ఆ రెండు వేదికల్లో మ్యాచ్లు సజావుగా ముగిశాక గత నెల చివర్లో అహ్మదాబాద్కు నాలుగు, ఢిల్లీకి నాలుగు జట్లు చేరుకున్నాయి. అయితే ఈ ప్రయాణాల కారణంగానే టోర్నీకి కరోనా ముప్పు ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్ల తరలింపు సమయంలోనే కోల్కతా, చెన్నై జట్లలో వైరస్ ప్రవేశించిందని అంచనా వేస్తున్నారు. తదుపరి మ్యాచ్ల కోసం జట్లు కోల్కతా, బెంగళూరుకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఆటగాళ్లు, ఫ్రాంచైజీల్లో ఆందోళన మొదలైంది.
అశ్విన్ సహా ముగ్గురు ఆటగాళ్ల నిష్క్రమణతో ఐపీఎల్లో మొదలైన కరోనా కలవరం తాజాగా కేసులు బయటపడడంతో తీవ్రమైంది. ఆటగాళ్లు, ఫ్రాంచైజీలకు టోర్నీపై ఆందోళన మొదలైంది. కరోనా టెస్టుల్లో కొన్నిసార్లు ఫలితాలు సరిగా రాకపోవడం మరింత కలవరపాటుకు గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలో టోర్నీ కొనసాగింపుపై బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నది. సీజన్ సజావుగా కొనసాగేలా, అందరిలో ధైర్యం నింపేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నది. మరోవైపు టోర్నీ ఇప్పటికే సగం పూర్తయినందు వల్ల వెనకడుగు వేసే అవకాశం లేదని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు బోర్డుకు సవాలేనని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ను విజయవంతంగా జరిపి టీ20 మెగా టోర్నీకి సిద్ధమని చెప్పాలనుకున్న బోర్డుకు ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.