సకాలంలో వైద్యం అందిచేందుకు కృషి చేస్తాం
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
భూపాలపల్లిరూరల్, ఏప్రిల్ 29 : ఐసొలేషన్ కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లను పెంచి రోగులకు అందుబాటులో ఆక్సిజన్ ఉండేలా చూడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. గురువారం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఉమ్మడి వరంగల్లోని కలెక్టర్లు, జిల్లా అధికారులతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్య లు, వ్యాక్సినేషన్పై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేయడంతో కరోనా బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందుతున్నాయన్నారు. 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపట్టిన కలెక్టర్లు, జిల్లా అధికారులను మంత్రులు ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాధారణ వైద్య సేవలకు కేఎంసీని సిద్ధం చేస్తున్నామని, కరోనా బాధితులకు సకాలంలో వైద్యం అందించడంలో పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల, మహాదేవ్పూర్ సీహెచ్సీలలో 60 బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో ఐసొలేషన్ కేంద్రాలుగా ప్రజలకు అందుబాటులో ఉంచామని, భూపాలపల్లి, కాటారం, చిట్యాల, మహాముత్తా రం, తాడిచర్లలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని దవాఖాన, ఏటూరునాగారం సీహెచ్సీలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలి
అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని, 45 సంవత్సరాలు దాటిన వారు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. సింగరేణి, జెన్కో కంపెనీల దవాఖానల్లో వైద్యసేవలు అందించాలన్నారు. ఆక్సిజన్తో కూడిన అంబులెన్స్లను సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఎంహెచ్వో సుధార్సింగ్, డీపీవో ఆశాలత, డీఆర్డీవో పురుషోత్తం, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మమత, డాక్టర్ రవి, డీఎల్పీవో సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.