పోలీసులను చూసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు
ఘటనా స్థలంలో జేసీబీ, కారు స్వాధీనం
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 25: సులభంగా ధనం సంపాదించాలని కొందరు వ్యక్తులు అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. చివరికి అవి ఫలించకపోగా చిక్కుల్లో పడుతున్నారు. అలాంటి ఘటన చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ సమీపంలోని గుట్ట ప్రాంతంలో శనివారం మధ్యరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు జేసీబీ సహాయంతో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. కాగా ఆ దారిగుండా పంట పొలాలకు వెళ్లే కొందరు గ్రామస్తులు, రైతులు గమనించి గ్రామంలోని మరికొంత మంది సహాయంతో తవ్వకాలు జరిపే ప్రాంతానికి వెళ్లి ఆరా తీసే ప్రయత్నం చేశారు. చివరికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అప్పటికే కొంతమంది దుండగులు పరారయ్యారు. ఘటనా స్థలంలో ఉన్న జేసీబీతోపాటు దుండగులు తీసుకొచ్చిన కారును పోలీసులు స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. పరారైన వారు కాకుండా ఎనిమిది మంది దుండగులను అదుపులో తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరిది మహబూబ్నగర్ పట్టణం, ఇద్దరు తిర్మలాపూర్ గ్రామానికి చెందిన జేసీబీ యజమాని, డ్రైవర్ ఉన్నారని పేర్కొన్నారు.