దొంగతనం నెపంతో ఓ వ్యక్తిని ఇద్దరు సెక్యూరిటీగార్డులు కొట్టి చంపారు.. అనంతరం మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి సమీపంలోని చెరువులో పడేశారు.. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో బయటపడ్డాయి. ఆ సెక్యూరిటీగార్డులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18న మల్లంపేట చెరువులో సురేశ్ మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.. వివరాల్లోకి వెళితే.. మల్లంపేటలోని లక్ష్మీశ్రీనివాస కన్స్ట్రక్షన్స్లో సురేశ్(28) కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. సురేశ్ మద్యానికి బానిస కావడంతో అతడి భార్య నాలుగు నెలల కిందట విడాకులు తీసుకొని మరొకరిని వివాహం చేసుకున్నది. ఒంటరిగా ఉంటున్న సురేశ్ మరింత మద్యానికి బానిసయ్యాడు. కాగా.. సురేశ్ నివాసం పక్కనే ఉన్న డ్రీమ్వ్యాలీలో రెండు నెలల కిందట దొంగతనం జరిగింది. ఈ నెల 17న రాత్రి సురేశ్ మద్యం మత్తులో డ్రీమ్వ్యాలీలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా…అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీగార్డులు అతడిని పట్టుకొని ప్రశ్నించగా ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది. వారు ఇనుపరాడ్డుతో సురేశ్ను కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేరం తమ మీదకు వస్తుందని భావించిన ఆ సెక్యూరిటీగార్డులు మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి ఖత్వాచెరువులో పడేసి చేతులు దులుపుకున్నారు.