హైదరాబాద్ : ఫేస్ మాస్కుల ఉల్లంఘన జాబితాలో ద్విచక్ర వాహనదారులు అగ్రస్థానంలో ఉన్నారు. కొవిడ్ విజృంభన నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిందిగా ఎంతగా చెబుతున్నప్పటికీ ద్విచక్ర వాహనదారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. కొంతమంది బైక్ రైడర్స్ ముక్కును సరిగ్గా కవర్ చేయకుండా మాస్కులు ధరిస్తున్నారు. మరికొందరు హెల్మెట్ ధరించక, ఫేస్ మాస్కులు ధరించక ఇష్టారీతిన తిరుగుతున్నారు.
దీంతో ఏప్రిల్ 12 నుంచి 17 వరకు 71,618 మందిపై పోలీసులు ఈ-పెట్టి కేసులు నమోదు చేశారు. ప్రతిఒక్కరి నుంచి రూ. వెయ్యి జరిమానాగా వసూలు చేశారు. నియమాలు ఉల్లంఘించిన వారిలో 29,710 మంది బైక్ రైడర్స్ ఉండగా 2,376 మంది కార్ల చోదకులు ఉన్నారు. ఆపై త్రీ వీలర్ రైడర్స్, భారీ వాహన డ్రైవర్లపై కూడా ఇటువంటి కేసులే నమోదు చేయబడ్డాయి. పాదచారులపై కూడా పోలీసులు దృష్టి సారించారు.
ఈ-పెట్టి కేసులలో ఎక్కువ భాగం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ కూడళ్ల వద్ద నిఘా కెమెరాల సహాయంతో బుక్ చేయబడ్డాయి. మరికొన్ని కేసులు పోలీసులు మాన్యువల్గా బుక్ చేశారు. గత కొన్ని వారాలుగా అధిక సంఖ్యలో నమోదు అవుతున్న కొవిడ్ పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఫేస్ మాస్క్ నియమావల్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హెల్మట్ నియమం వలె ఫేస్ మాస్కు నియమాన్ని కూడా కచ్చితంగా అమలు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి ఓ వీడియో సందేశంలో తెలిపారు.