న్యూఢిల్లీ: వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగిరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలను ప్రారంభించింది. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకా ఉత్పత్తిని సెప్టెంబర్లోగా నెలకు 10 కోట్ల డోసులకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) శుక్రవారం వివరాలు వెల్లడించింది. ‘ప్రస్తుతం నెలకు కోటి కొవాగ్జిన్ టీకా డోసులు ఉత్పత్తి అవుతున్నాయి. జూలై-ఆగస్టు నాటికి ఈ సంఖ్యను ఆరేడు కోట్లకు, సెప్టెంబర్ నాటికి నెలకు 10 కోట్ల డోసుల ఉత్పత్తికి పెంచాలని నిర్ణయించాం’ అని డీబీటీ వెల్లడించింది. ‘కొవిడ్ సురక్ష’ మిషన్లో భాగంగా బెంగళూరులోని భారత్ బయోటెక్ కొత్త ప్లాంట్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి రూ.65 కోట్లను కేటాయించినట్టు తెలిపింది.