ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
అర్బన్ జిల్లాలో 685 మంది లబ్ధిదారుల ఎంపిక
మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం చేతుల మీదుగా పంపిణీ
హన్మకొండ, ఏప్రిల్ 14 : రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం దివ్యాంగులకు సైతం చేయూతనందిస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. ఆసరా పింఛన్ల ద్వారా ఒక్కొక్కరికీ రూ.3016 అందించడంతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి దివ్యాంగులకు అవసరమైన వివిధ రకాల ఉపకరణాలు అందించాలని నిర్ణయించింది. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఈ పరికరాలను అందజేస్తున్నారు. ఇందుకు ఇటీవల ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా స్థాయిలో ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో సుమారు 685 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి బుధవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ చేతుల మీదుగా సుమారు రూ. 1.33 కోట్ల విలువైన పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేశారు.
685 మంది లబ్ధిదారులకు పంపిణీ..
జిల్లాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇప్పటికే ఎంపిక చేసిన 685 మంది దివ్యాంగ లబ్ధిదారులకు పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేశారు. వీటిలో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికిల్స్ 27, బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు 20, బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్లు 196, ల్యాప్టాప్లు 9, డైసీ ప్లేయర్లు 3, 4జీ స్మార్ట్ ఫోన్లు 12, ట్రై సైకిళ్లు 46, ఫోల్డబుల్ వీల్చైర్లు 61, క్రచర్లు 91, హియరింగ్ పరికరాలు 44, వాకింగ్ స్టిక్స్ 63, ఎంపీత్రీ ప్లేయర్లు 24, క్యాలీపర్స్లు 20, ఆర్టిఫీషియల్ లిబ్స్(69)లను లబ్ధిదారులకు అందజేశారు.