రైతుకు రుణపడి జీవించు.. ఆకలి రణమును తొలగించు.. పుడమి తల్లిని నిదురలేపే.. దినకర తేజుడు రైతేరా.. పాడి పంటలకు పురుడు పోసే.. మంత్రసాని మన రైతేరా.. బీడు పడిన ఈ ధారా తలాన్ని.. సాగుభూమిగా సాధన చేసి.. దేశ ప్రజలకు అన్నం పెట్టే.. దైవ స్వరూపుడు రైతేరా.. అంటూ అన్నదాత కష్టాలపై అనేక కవితలు రాశాడు బడంగ్పేటకు చెందిన ఆకుల వెంకటరమణ. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లిలో సాధారణ పేద కుటుంబంలో పుట్టిన వెంకటరమణ కలం నుంచి కవిత్వం నీటి ఊటలా జాలు వారుతుంది. సాహితీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రమణ పల్లె పట్నం అన్న తేడా లేకుండా కొత్త కొత్త పదాలతో అలవోకగా కవితలు అల్లడంలో దిట్ట. ఆయన కంటికి కనిపించిన ప్రతి అంశంపై కవితలు రాశాడు. నిజ జీవితానికి దగ్గరగా రాసిన 60 కవితలకు పురస్కారాలు లభించాయి. ఎంతోమంది ఉత్తముల నుంచి అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.
నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామానికి చెందిన సాధారణ పేద కుటుంబానికి చెందిన ఆకుల ముత్యాలమ్మ, చెన్నయ్య దంపతుల మొదటి సంతానం వెంకట రమణ. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నసర్లపల్లి, 6 నుంచి 10వ తరగతి వరకు చింతపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. అనంతరం హైదరాబాద్లో ఓ కంపెనీలో కార్మికుడిగా చేరి ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఎంఏ పూర్తి చేశాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఆయన అనేక కష్టాలు అనుభవించాడు.
బాల్యం నుంచే వెంకటరమణ అనేక కష్టాలు పడ్డారు. ఆయన గడిపిన దుర్భర జీవితమే కవితలు, పాటల్లో కనిపిస్తుంది. అనుభవమే పాటలు రాయడం నేర్పిందని.. నిజ జీవితంలో అనుభవించిన సాధక బాధకాలే కవితలు అల్లేలా చేసిందంటారు వెంకటరమణ. హైదరాబాద్లోని చింతల్లోని ఓ చైన్ల కంపెనీలో కార్మికుడిగా చేరి ఆపై అదే కంపెనీలో ప్రస్తుతం మేనేజర్ స్థాయిలో విధులు నిర్వహిస్తూనే ప్రజలు కష్టాలు, కడగండ్లపై అనేక కవితలు రాశారు. నగరాన్ని వరదలు చుట్టుముట్టినప్పుడు ముంపులో తన ఇల్లు మునిగిపోయింది. అప్పటి భయానక పరిస్థితులపై కదిలించే కవితలు ఎన్నో అల్లారు. రైతుల కష్టాలు, పేదరికం, కార్మికులు, వరదలు, కరోనా కల్లోలం, మహిళల జీవన విధానం, బాల కార్మికులు, వరకట్న దురాచారంపై రాసిన కవితలు ఎందరినో ప్రభావితం చేయగా.. అనేక ప్రశంసలు పొందాయి. వివిధ సాంస్కృతిక సంస్థల నుంచి 60కి పై చిలుకు కవితలు ప్రశంసలు అందుకున్నాయి.