ప్రస్తుత పరిస్థితులు రోజు రోజుకు కళాకారుల జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి. కరోనా ప్రభావం అన్ని రంగాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. వందల ఏళ్ల నుంచి సామాజిక చైతన్యం, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించే నాటక రంగం తన వైభవాన్ని నిలబెట్టుకునేందుకు కొత్త పుంతలు తొక్కాల్సిన సందర్భమిది. ప్రస్తుత పరిస్థితుల్లో వేదికలపై ప్రదర్శనలు చేయడం కన్నా.. ఆన్లైన్ ద్వారా నాటకాలను ప్రదర్శించడం శ్రేయస్కరమని కళాకారులు, నాటక సంస్థలు సాంకేతిక ప్రయోగాలపై దృష్టి పెట్టడం మంచి పరిణామం. ప్రముఖ నాటక రంగ సంస్థ ‘అభినయ థియేటర్ ట్రస్ట్’ జన బాహుళ్యంలో చోటు చేసుకున్న పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేసుకుంటూ కళా సేవలో తనదైన ధోరణిలో కొనసాగిస్తుంది. కళాభిమానులను ఆకట్టుకునేందుకు ఆన్లైన్ వేదికను ఆసరాగా చేసుకొని వినూత్నంగా సాంస్కృతిక సేవలను అందిస్తోంది. జాతీయ స్థాయిలో బహు భాషా నాటకోత్సవాలను నిర్వహిస్తూ కళాభిమానులను నిత్యం రంజింపజేస్తోంది ‘అభినయ థియేటర్ ట్రస్ట్’.
హైదరాబాద్ వేదికగా దేశంలోని అన్ని భాషలకు సంబంధించిన నాటకాలను ఆన్లైన్ ద్వారా వంద రోజుల పాటు ప్రదర్శించే ప్రక్రియను దేశంలోనే తొలిసారి చేపట్టినట్లు అభినయ థియేటర్ ట్రస్ట్ అధ్యక్షుడు అభినయ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేదిక మీద ప్రదర్శించే నాటికను 800 నుంచి వెయ్యి మంది వరకు ఆస్వాదిస్తారు. అదే ఆన్లైన్లో ద్వారా ప్రదర్శిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది వీక్షించేందుకు అవకాశం ఏర్పడుతున్నది. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో.. అభినయ ఆైన్లెన్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్-2021ను ఏప్రిల్ 5 నుంచి జులై 14 వరకు చేపట్టనున్నట్లు తెలిపారు. తాము చేపట్టిన ఆన్లైన్ డ్రామా ఫెస్టివల్ సందర్భంగా వంద రోజులు – వంద నాటకాలను తమ సంస్థకు సంబంధించిన యూ ట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కళాప్రియులు, కళాకారులు నాటకాలను తమ ఇండ్లలోనే ఉండి వీక్షించే అవకాశం కల్పించేందుకు ఆన్లైన్ వేదికపై ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని దేశ వ్యాప్తంగా పలు భాషలకు చెందిన నాటకాలను ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ‘అభినయ థియేటర్ ట్రస్ట్’ నయా ప్రయోగాన్ని చేపట్టింది. హైదరాబాద్ వేదికగా ఆ సంస్థ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ప్రదర్శించే నాటకాలను ఎంపిక చేసి నాటక ప్రియులకు అందించడంతో పాటు కళాకారుల్లో కూడా నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. దీంతో నాటకాభిమానులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మొబైల్ ఫోన్లోనే ఆన్లైన్ ప్రత్యక్ష నాటక ప్రదర్శనలను వీక్షించే అవకాశం దక్కింది. నాటక కళను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆన్లైన్లో నాటక ప్రదర్శనలకు శ్రీకారం చుట్టడం పట్ల కళాకారుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన చిక్కు వల్ల తెలుగు రాష్ర్టాల్లోని ఎంతో మంది వృత్తి కళాకారులు అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాటక కళాకారులు, సంస్థలు, కళా ప్రియులకు నాటకాలను చేరువ చేసేందుకు మా సంస్థ ద్వారా ప్రయత్నిస్తున్నాం. అంతే కాకుండా మా ట్రస్ట్ తరఫున వృత్తి కళాకారులకు లాక్డౌన్ సమయంలోనే కాకుండా.. ప్రస్తుతం కూడా నిత్యావసర సరుకులను అందించి మా వంతు సహకారం అందిస్తున్నాం. వంద రోజుల పాటు వంద నాటకాలను ఆన్లైన్లో ప్రదర్శించడం ఒక పండుగలా భావిస్తున్నాం. అభినయ సంస్థ ద్వారా వివిధ భాషల నాటకాలతో పాటు తెలుగు నాటకాలు, సురభి నాటకాలను https://youtube.com/c/ TricolourTV ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారం చేస్తున్నాం. వివిధ భాషల్లో ప్రసారమయ్యే రంగస్థల నాటకాలను వీక్షకులు తిలకించి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. – అభినయ శ్రీనివాస్, అధ్యక్షుడు, అభినయ థియేటర్ ట్రస్ట్