మేడ్చల్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ హయాంలో కవులు, కళాకారులకు గుర్తింపు లభించిందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశపు హాల్లో శనివారం రాత్రి స్వతంత్ర భారత్ అమృత్ మహోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి తగిన గౌరవాన్ని కల్పిస్తున్నారని అన్నారు. కవి సమ్మేళనానికి స్వాతంత్య్ర స్ఫూర్తిని థీమ్గా నిర్ణయించినట్లు తెలిపారు.
75వ స్వతంత్ర భారత దినోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా 75 వారాల పాటు నిర్వహించనున్నట్లు, తదనుగుణంగా స్వాతం త్య్ర పోరాట ఘట్టాల గురించి నేటి తరం, యువతరం పిల్లలకు అవగాహన కల్పించేందుకు అమృతోత్సవ కమిటీ పలు కార్యక్రమాలను నిర్వహించనుందన్నారు. కవిత్వం అంటే ఉన్నత చదువులు చదివిన వారి నుంచి అక్షరం తెలియని వారికి అందులోని భావుకతను తెలియజేస్తుందని, మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఒక కవిత్వం తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కవులను ప్రోత్సహించేందుకు కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిందని, దీని వల్ల ప్రతి ఒక్కరికి తమ ప్రతిభను చాటుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 47 మంది కవులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించి ప్రశంసా పత్రాలతో పాటు పారితోషికాలను అందజేశారు. కవుల కవిత్వాలు పలువురిని అకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో దేవ సహాయం, డీఆర్వో లింగ్యా నాయక్, జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి బల రామారావు, ఆర్డీవోలు మల్లయ్య, రవి, ఏవో వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు, జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన కవులు, కళాకారులు పాల్గొన్నారు.